హైదరాబాద్-విజయవాడ రహదారిపైకి వరద నీరు-తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలపై ప్రభావం..
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లోనూ భారీగా వరద చేరుతోంది. దీంతో పాటు వాటి ఉపనదులు కూడా పొంగుతున్నాయి. దీని ప్రభావం సహజంగానే రోడ్లపై రాకపోకలపై పడుతోంది. తెలుగు రాష్ట్రాలను కలిపే విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై నిత్యం వేల కొద్దీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. కానీ రెండు రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో రోడ్డుపై రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా భారీ వాహనాలు ఈ వరద నీటిలో వెళ్తే ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయో అన్న భయంతో ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. దీంతో ఈ వాహనాల్లో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది.

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. జాతీయ రహదారిపై నదిలాప్రవహిస్తున్న మున్నేరు వరద నీటితో చిన్నవాహనాలు కూడా వేగంగా వెళ్లేలేని పరిస్ధితి ఉంది. దీంతో పోలీసు సిబ్బంది భారీగా ఇక్కడికి చేరుకుని రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. వాహనదారులకు ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
జాతీయ రహదారిపైకి చేరిన వరద నీటి కారణంగా స్ధానికంగా నివసిస్తున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. జాతీయ రహదారిపై టూవీలర్ ఫోర్ వీలర్స్ వాహనాలు రాకుండా కట్టడి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులు వేరే మార్గాలు ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాట్లు పోలీసులు తెలిపారు. అసలే ఇవాళ రాత్రి, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఇబ్బంది తప్పదనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications