ఏపీకి భారీ వర్ష సూచన- ఆ జిల్లాలు అలర్ట్..!!
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. అటు ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ఏరియాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.
బంగాళాఖాతం ఉత్తర- మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఈ ఆవర్తనం వాయుగుండగా మారింది. దీని ఫలితంగా మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

విపత్తుల నిర్వహణ విభాగం కూడా భారీ వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జాబితాలో 14 జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది.
తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, కర్నూలు, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ఇప్పటికే గుంటూరు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, ఏలూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. గుంటూరులో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది.












Click it and Unblock the Notifications