ఏపీకి బిగ్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్..!!
తుఫాను ప్రభావం ఏపీలోనూ కనిపిస్తోంది. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల లో సైతం కుండపోత కొనసాగుతోంది. రిజర్వాయర్లు నిండుకున్నాయి. తుఫాను తీరం దాటినా ఏపీలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజా హెచ్చరిక చేసింది. మూడు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఛాన్స్ ఉందని అలర్ట్ ఇచ్చింది. దీంతో, ప్రభుత్వం తుఫాను తీరం దాటిన తరువాత పరిస్థితులను సమీక్షిస్తోంది. అధికారులకు అవసరమైన సూచనలు చేస్తోంది.
బంగాళాఖాతంలో తుఫాను తీరం దాటింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కానీ, ఈ ప్రభావం ఏపీ పైన ఉందని వెల్లడించారు. దీంతో, ఏపీలో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసారు. దక్షిణ కోస్తా, రాయల సీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసారు. ప్రధానంగా రానున్న రెండో రోజులు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిక జారీ చేసారు. అదే విధంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని అలర్ట్ చేసారు.

భారీ వర్షాల కారణంగా రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, తిరుమలలోనూ కుండపోత వర్షం కొనసాగుతోంది. తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నడక మార్గంలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. అయితే, టీటీడీ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలతో ఎలాంటి ప్రమాదాలు లేకుండా భక్తుల రాకపోక లు సాగుతున్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంతం, మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, రోడ్లు, కాటేజీలు, బస్టాండ్, పార్కులు తడిసి ముద్దయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు గదులకే పరిమితం అయ్యారు.












Click it and Unblock the Notifications