అనంతలో భారీ వర్షం, ఆ జలాశయం తొలిసారి నిండింది: ఏపీ రైతులు వర్సెస్ కర్నాటక రైతులు
అనంతపురం నగరంతోపాటు, జిల్లాలోని వివిధ మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి కట్ట తెగింది.
అనంతపురం: అనంతపురం నగరంతోపాటు, జిల్లాలోని వివిధ మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి కట్ట తెగింది.
ఏపీ రైతుల్ని అడ్డుకున్న కర్నాటక రైతులు
మడకశిరలోలో ఉన్న స్వర్ణముఖి కట్ట తెగింది. దీంతో నీళ్లు భారీ ఎత్తున కిందకు వెళ్తున్నాయి. గళిక చెరువుకు రావాల్సిన నీరు కర్నాటక వైపు వెళ్తోంది. దీంతో ఏపీ రైతులు కట్టను సరిచేసే ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలను కర్నాటక రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతలో రికార్డు స్థాయిలో వర్షం
అనంతపురంలో అయితే రికార్డు స్థాయిలో భారీవర్షం కురవడం, గతంలో వాగులు, నాలాలు కబ్జాలకు గురికావడంతో వాన నీరంతా రోడ్ల పైకి, కాలనీల్లోని ఇళ్లలోకి చేరింది. దీంతో భయానక వాతవరణం ఏర్పడింది. వర్షం ఆధివారం తెల్లవార్లు కురుస్తూనే ఉండటం, వాగులు, వంకలు సైతం సోమవారం మధ్యాహ్నం వరకు ప్రవహించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో భయానక పరిస్థితులు కనిపించాయి. అనంతలో చెరువులు నిండిపోయాయి. పొంగిపొర్లుతున్నాయి.
Recommended Video
నీట మునిగిన కాలనీలు, పరిటాల సునీత పర్యటన
అనంతపురంలో నీట మునిగిన కాలనీల్లో ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ వీరపాండియన్, ఇతర అధికారులు పలు కాలనీల్లో నీటమునిగిన ఇళ్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. కొందరు ప్రజాప్రతినిధులు ముంపువాసులకు సహాయం అందించారు.
జలాశయాల్లో జలకళ
ఎగువ నుంచి హెచ్చెల్సీ ద్వారా వస్తున్న తుంగభద్ర జలాలకు, హంద్రీనీవా ద్వారా వస్తున్న కృష్ణా జలాలకు తోడు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరదనీరు వస్తుండటంతో పలు జలాశయాలు కళకళలాడుతున్నాయి. పెన్నా నదిలో వరదనీరు ప్రవహిస్తుండటంతో చాగల్లు జలాశయానికి ఎక్కువగా నీరు చేరుతోంది.
తొలిసారి నీరు వచ్చింది
ఎంపీఆర్ ఉత్తర కాల్వకు చివర్లో పెద్దపప్పూరు మండలంలో ఉన్న పెండేకల్లు జలాశయానికి తొలిసారిగా నీరొచ్చింది. ఆరేళ్ల కిందట ఈ జలాశయం నిర్మించగా ఇప్పుడే తొలిసారిగా అందులో నీరు చేరింది.