భారీ వర్షాలకు 35 మంది మృతి: తిరుమలలో విరిగిపడిన కొండచరియలు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు మొత్తం 35 మంది మరణించినట్లు అంచనా. కాగా, చిత్తూరు జిల్లా మళ్లీ భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ముల్కలచెరువు మండలంలో కురిసిన భారీ వర్షాలకు పురాతన ఆంజనేయ స్వామి ఆలయ గోపురం కూలిపోయింది. ఇది 15వ శాతాబ్దానికి చెందిన ఆలయం.విజయనగర రాజుల కాలంలో నిర్మించినటువంటిది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలయ గోపురం నానిపోయి గురువారం సాయంత్రం కూలిపోయింది.
కాగా, అంజేరమ్మ కనుమ వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. గత వారం నుంచి కురుస్తున్న తీవ్ర వర్షాలతో మొదటి ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న ఇంజినీరింగ్ సిబ్బంది ఘాట్ వద్దకు వెళ్లి కొండచరియలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
మొదటి ఘాట్రోడ్డులో 53వ మలుపు వద్ద విరిగిపడిన కొండచరియలు పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే వర్షం కారణంగా రెండో ఘాట్లో మరమ్మతులు నిలిచిపోయాయి.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రానున్న 24గంటల్లో సీమాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కృష్ణా, గుంటూరు సముద్ర తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాయలసీమ, కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. వరద బాధిత ప్రాంతాల్లో విపత్తు నివారణ శాఖ విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 12వేల దుప్పట్లు పంపిణీ చేసింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications