మూడురోజులు భారీ వర్షాలు..ఆ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, ఐఎండీ హెచ్చరిక!
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. నేడు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర, యానంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి . దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాల మీదుగా రుతుపవన ద్రోణి కూడా విస్తరించి ఉండడంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.భారీ\

ఈ పోర్టులలో మూడవ ప్రమాద హెచ్చరిక
ఈనెల 18వ తేదీ వరకు సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొంది. ఇప్పటికే కళింగపట్నం, భీమిలి, గంగవరం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో జల్లులుగా వర్షం మొదలవుతుంది.
విశాఖపట్నం, తుని, విజయనగరం జిల్లాలలో జోరు వానలు
రాత్రి 9 గంటల వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం గా మారుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, తుని, విజయనగరం జిల్లాలలో జోరు వానలు కురుస్తాయి. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో వర్షం దంచి కొడుతుందని శాటిలైట్ అంచనాలతో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలో నేడు కురిసే వర్షాల పైన ప్రకటన చేసింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పిందిదే
అల్పపీడనం ప్రభావంతో నేడు చెదురుమదురుగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి,విశాఖ జిల్లాల్లో మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కృష్ణా నదీ వరద ప్రవాహంపై అలెర్ట్
ఇదే సమయంలో కృష్ణా నది వరద ప్రవాహం పైన కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. కృష్ణ నదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుందని పేర్కొంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల వద్ద వరద ఉధృతి నేపథ్యంలో గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.












Click it and Unblock the Notifications