వర్షం ఎఫెక్ట్: నల్లవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు, కుప్పకూలిన వంతెన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు.
భయం గుప్పిట్లో హైద్రాబాద్: క్యుములోనింబస్ మేఘాలు అంటే ఏమిటీ?
వారం రోజులుగా తెలంగాణలోని పలు చోట్ల వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హైద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైద్రాబాద్ను ముంచేసిన వర్షం: భయం గుప్పిట్లో...
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు.చిత్తూరు జిల్లాలో వంతెనలు కొట్టుకుపోయాయి.
వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు మహిళలు
ప్రమాద వశాత్తు వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం పాత అంబాపురం గ్రామంలో చోటుచేసుకొంది..గురజాల మండలంలోని పాత అంబాపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి వరలక్ష్మి (50), గన్నవరపు చినలక్ష్మమ్మ (50) కలిసి పొలానికి వెళ్లి, సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి వస్తూ మార్గ మధ్యలో నల్లవాగును దాటేందుకు దిగారు.
అయితే వాగులో కొంతదూరం నడుచుకుంటూ వచ్చిన ఇరువురు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటి వేగానికి కొట్టుకుపోయారు. పొలానికి వెళ్ళిన ఇద్దరు మహిళలు ఇంటికి తిరిగి రాకపోవడంతో అర్ధరాత్రి సమయంలో బంధువులు పొలం వద్దకు వెళ్ళి వెదికినప్పటికీ కనిపించలేదు. వాగులో కొట్టుకుపోయారనే అనుమానం కలగడంతో సోమవారం ఉదయానే్న నల్లవాగులో వెదుకుతూ వెళ్ళగా, కొంత దూరంలో ఇరువురి మృతదేహాలు కంపచెట్ల మధ్య కనిపించాయి.
చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షం
చితూరు జిల్లా మదనపల్లె, పులిచర్ల మండలాల్లో ఆదివారం రాత్రినుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పులిచర్ల మండలం భీమవరం మార్గంలో వంతెన కొట్టుకుపోయింది. పులిచెర్ల మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.
తుడుంవారిపల్లెను ముంచెత్తిన వరద
హంద్రీ-నీవా కాలువ నీరు పాళెం పంచాయతీ తుడుంవారిపల్లిని ముంచెత్తడంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని రాత్రంతా జాగారం చేశారు. నిత్యావసర వస్తువులు నీటిలో కొల్లుకుపోయాయి. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వేకువఝామున జేసిబి సాయంతో హంద్రీ-నీవా కాలువకు మరో ప్రాంతంలో గండి కొట్టడంతో తుడుంవారిపల్లి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కూలిన వంతెన రాకపోకలు బంద్
ఎల్లంకివారిపల్లి- భీమవరం మార్గంలో ఇటీవల నిర్మించిన వంతెన వర్షం ధాటికి ఒక వైపు కొట్టుకుపోవడంతో తిరుపతికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాయవారిపల్లి, ఎల్లంకివారిపల్లి, మంగళంపేట ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మపల్లి సమీపంలో చెక్డ్యామ్ కొట్టుకుపోవడంతో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. చెరువులు పొంగి పొర్లుతున్నాయి.