హైదరాబాద్-గుంటూరు మధ్య నిలిచిన రాకపోకలు
హైదరాబాద్: గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడంతో హైదరాబాద్ - గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం గుంటూరులో భారీ వర్షం కురిసింది. రెండు మూడు గంటల్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ - గుంటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
సత్తెనపల్లి, అమరావతి, ప్రత్తిపాడు, కర్లపాలెం, కాకుమానూరు తదితర ప్రాంతాల్లో భారీగా వాగులు పొంగుతున్నాయి. మేడికొండూరు వద్ద కొండవీటివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లపాడు - పేరేచర్ల రైల్వే ట్రాక్ పైకి నీరు వచ్చింది. దీంతో నంద్యాల ప్యాసింజర్ రైలు ఆగిపోయింది.
వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలును తెనాలి మీదుగా మళ్లిస్తున్నారు. కాగా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా గుంటూరు - అమరావతి రోడ్డులోని లామ్ వద్ద కొండవీటివాగు ఉధృతికి ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. స్థానికులు ఒకరిని రక్షించారు. మరొకరు వాగులో గల్లంతయ్యారు.