అంతు చూస్తున్న వర్షాలు: వణికిపోయిన గుంటూరు (పిక్చర్స్)
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వరుణుడు తన ప్రతాపం చూపించాడు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.
చాలా చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు వంకలు పొంగిపొర్లడంతో గ్రామాలు నీటమునిగాయి. రహదారులు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోవడంతో రవాణా స్తంభించింది. ప్రకాశం, కర్నూలులో పొంగిన వాగులు నల్లమల అటవీప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
గుండ్లకమ్మ వాగుకు వరదనీరు పోటెత్తడంతో రాచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న రామన్నకత్తువ రిజర్వాయర్ కట్టకు గండిపడింది. పర్చూరు మండలంలోని సాకివాగుపై అడుసుమల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా రాకపోకలు కోసం పక్కన అప్రోచ్ రోడ్డు వేశారు. వాగులో నీటి ఉధృతితో ఆ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో పర్చూరు నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో భారీ వర్షాలకు చామకాలువ, మద్దిలేరువాగు ఉప్పొంగడంతో కుందూ నది ఉధృతంగా ప్రవహించింది. పాలేరు, రాళ్లవాగు ఉప్పొంగడంతో నంద్యాల-మహానంది-గాజుపల్లె గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బవనాసి నది ఉప్పొంగడంతో కొత్తపల్లి, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వర్షాలతో అతలాకుతలమైంది.
బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో పల్నాడు ప్రాంతంలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. నివాసిత ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. పల్నాడులో సగటున 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నకరికల్లులో అత్యధికంగా 24.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వణికిపోయిన గుంటూరు జిల్లా
భారీ వర్షాలకు గుంటూరు జిల్లా రెక్కలు తడిసిన పక్షిలా వణికిపోయింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజా జీవనం స్తంభించిపోయింది. వాహనాలు వరదల్లో చిక్కుకున్న సంఘటనలు కూడా నమోదయ్యాయి. వరదల నుంచి ప్రజలను కాపాడడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
పొంగిపొర్లుతున్న వాగులు
గుంటూరు జిల్లాలోని నడికుడి మార్గంలో రైల్వే ట్రాక్ మీదగా వరద నీరు ప్రవహిస్తోంది. ఎద్దువాగు, నాగులేరు, చంద్రవంక, ఎర్రవాగు, వెన్నాదేవి, అనుపాలెం, ముప్పాళ్ల, జొన్నలగడ్డ, కొప్పగంజి వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
నిలిచిపోయిన రైళ్లు
బెల్లంకొండ - పిడుగురాళ్ల మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో గుంటూరు - నడికుడి - సికింద్రాబాద్ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. గుంటూరు పట్టణంలోని పలు కాలనీలు వరదనీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాగుల ఉధృతికి సత్తెనపల్లి నుంచి మాచర్ల, నరసరావుపేట, క్రోసూరు, అచ్చంపేట మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.
కొట్టుకుపోయిన వంతెన
జొన్నలగడ్డ వద్ద వాగుపై వంతెన కొట్టుకుపోయింది. తుమ్మలచెరువు చెట్టు సమీపంలో అద్దంకి-నార్కెట్పల్లి రహదారికి గండి పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్, చెన్నైలతోపాటు పల్నాడు వైపు వెళ్లే, పల్నాడు నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు
వరద
నీటి
ఉధృతికి
కారు
కొట్టుకుపోయింది.
కొండవీటి
వాగు
ఉధృతికి
మేడికొండూరు
వద్ద
నిర్మిస్తున్న
వంతెన
పక్కనున్న
అప్రోచ్
రోడ్డు
కొట్టుకుపోయింది.
దీంతో
గుంటూరు-సత్తెనపల్లి
రహదారిలో
ట్రాఫిక్
స్తంభించిపోయింది.
కిలో
మీటరు
పొడవునా
వాహనాలు
నిలిచిపోయాయి.
ఈ రైళ్లూ ఆగిపోయాయి
గుంటూరు - హైదరాబాద్, గుంటూరు - వినుకొండ రోడ్డు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రైలు ప్రయాణికులకు రెడ్డిగూడెం, బెల్లంకొండ పరిసర గ్రామాల ప్రజలు భోజనం తయారు చేసి తీసుకెళ్లి వడ్డించి దాతృత్వాన్ని చాటుకొన్నారు.
దెబ్బ తిన్న పంటలు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో 41 వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని, రాష్టమ్రంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రులు
ప్రధానంగా ముంపునకు గురైన చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలను మంత్రులు సందర్శించారు. కుప్పగంజి వాగు ప్రాంతాన్ని సందర్శించి వాగు మధ్యలో చిక్కుకున్న చేవూరి వెంకటేశ్వర్లును రక్షించిన స్థానికులను మంత్రులు అభినందించారు. భారీవర్షాలు, వరదలకు గురైన బాధితులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని మంత్రులు చెప్పారు.
ఆర్థిక సాయం చేస్తాం..
గుంటూరు జిల్లాలో భారీవర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఐదుగురి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని మంత్రులు తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా 27 వేల హెక్టార్లలో పత్తి 6400 హెక్టార్లలో కంది, 6,200 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
పునరావాస కేంద్రాలు ఏర్పాటు
గుంటూరు జిల్లాలో వరద ప్రభావానికి గురైన ఆరు మండలాల్లో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సుమారు 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజనాది ఏర్పాట్లను చేశామని మంత్రులు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 9 జిల్లాల్లో అధికవర్షపాతం నమోదైందని, గుంటూరు జిల్లాలోనే 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.
మరో రెండు రోజులు వర్షాలు..
మరో రెండు రోజుల పాటు భారీవర్షాలు పడే అవకాశముందని, ఈ దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేలా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు మంత్రులు తెలిపారు.
సురక్షితంగా బయటపడ్డారు
వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్రోసూరు మండలంలో గురువారం వూటుకూరు వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది. అధికారులు తొలుత హెలికాప్టర్ సాయంతో బాధితులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అయితే స్థానికుల సాయంతో తాడు ద్వారా వారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.