ఏపీకి గుడ్ న్యూస్: ఈ జిల్లాల్లో
Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఫర్వాలేదనిపించాయి. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా విస్తరించనుంది. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చు.
కర్నూలు, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ చెప్పారు. వరద నీరు ప్రవహిస్తోన్న సమయంలో వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications