బీ అలెర్ట్.. శ్రీశైలం జలాశయం వద్ద విరిగిపడ్డ కొండ చరియలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీశైలం జలాశయం దగ్గర కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బండ రాళ్లు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం-హైదరాబాద్ రహదారి ఏపీ పవర్ హౌస్ దగ్గర కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. బండరాళ్లు పడిన సమయంలో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్పష్టం చేశారు.
అయితే కొండ చరియలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ప్రతిసారి కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంతేకాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయానికి ఇన్ ఫ్లో 2,87,391 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,20,902 క్యూసెక్కులుగా ఉంది. జూరాల, సుంకేసుల, నుంచి శ్రీశైలానికి 1,61,414 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది. మరోవైపు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. వరద ప్రవాహం పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు అల్పపీడనం కారణంగా ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం,విశాఖపట్నం, మన్యం, కాకినాడ,అల్లూరి సీతారామరాజు, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడపలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications