ఏపీలో ఆకాశం నుంచి చేపలు!, టోర్నడోలను తలపించే సుడిగాలుల బీభత్సం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి చేపల వర్షం కురిసింది. ఓ వైపు సుడిగాలులు బీభత్సం సృష్టించగా, మరోవైపు ఆకాశం నుంచి చేపలు పడటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజలు చేపలను ఏరుకున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల వర్షం కురిసింది.
పాశ్చాత్య దేశాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించడం మనకు తెలిసిందే. అలాంటి టోర్నడోలు ఇప్పుడు ఏపీలోను అప్పడప్పుడు కనిపిస్తున్నాయి. టోర్నడోల తరహా కాకపోయినా ఏపీలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. వీటిని చూసి జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరులో భారీగా సుడిగాలులు వచ్చాయి. దీంతో, నీటితో పాటు చెరువులోని చేపలు కూడా పెద్ద ఎత్తున పైకి ఎగిరి పడ్డాయి. అంతేకాదు, చేపల చెరువుల మధ్య సుడులు తిరుగుతున్న నీళ్లు ఎగిరి గట్ల పైన ఉన్న కొబ్బరిచెట్లను ఎత్తి పడేశాయి. ఈ గాలులకు, నీటి తాకిడికి కొబ్బరి చెట్లు కూలాయి. చేపలు ఎగిరిపడ్డాయి. కాగా, అంతకుముందు కొల్లేరులో వచ్చిన భారీ సుడిగాలి ఇంటర్నెట్లో ఇప్పటికే హల్ చల్ చేస్తోంది.
ఏపీని తాకిన నైరుతీ రుతు పవనాలు
నైరుతి రుతపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పూర్తిగాను, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో పాక్షికంగా విస్తరించాయి.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.