తెలుగు నాట కొలువైన తొలి గణేషుడి శిల్పం ఇదేనట!:చేజర్ల కపోతేశ్వరుని ఆలయంలో జనగణపతి...
గుంటూరు:తెలుగు వారి తొలి గణేషుడి శిల్పం గుంటూరు జిల్లాలో కొలువై ఉన్నట్లు కల్చరల్ సెంటర్ ఆఫ్ అమరావతి, విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెబుతున్నారు.
నకరికల్లు మండలం చేజర్లలోని కపోతేశ్వరుని దేవాలయంలో ఉన్న జనగణపతి శిల్పమే తెలుగువారి మొట్టమొదటి వినాయకుడి శిల్పం కావొచ్చనేది తన పరిశోధనలో తేలిందని ఈమని శివనాగిరెడ్డి చెబుతున్నారు. ఈ వినాయకుడి విగ్రహం పల్నాటి సున్నపురాతిలో చెక్కి ఉండటం ఒక విశేషంగా ఆయన తెలిపారు. చేజర్లను రాజధానిగా పాలించిన ఆనందగోత్రికుల వంశానికి చెందిన రాజులు ఈ శిల్పాన్ని చెక్కించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోందన్నారు.
ఈ గణేషుడి శిల్పం రెండు చేతులు కలిగి, వాటిలో మోదకం, దంతాలను ధరించి ఉండటంతో పాటు కిరీటం లేకుండా సహజమైన ఏనుగు ముఖంతో కొలువై ఉంటారు. ఒంటిపై పరిమిత ఆభరణాలతో అలంకరించి ఉన్నారు. తెలుగు రాష్ట్రంలో ఈ వినాయకుడి విగ్రహమే చారిత్రకంగా పేర్కొనదగిన తొలి రాతి శిల్పమని ఆయన పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో మరిన్ని పురాతన వినాయకుని విగ్రహాల వివరాలను డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. అమరావతి స్థూపం రాతి కంచె పైభాగంలో గజముఖం గల గణరూపం, గణేషుడి ప్రతిమ రూపకల్పనకు దారితీసిందనీ, కర్నూలు జిల్లా వీరాపురంలో బిర్లా పురావస్తు సంస్థ జరిపిన తవ్వకాల్లో క్రీ.శ. ఒకటో శతాబ్దానికి (శాతవాహన) చెందిన మట్టితో చేసిన గణేశుని ప్రతిమ దొరికిందన్నారు.
ఆ తరువాత పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో కేంద్ర పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో శాలంకాయనుల కాలం (క్రీ.శ.4,5 శతాబ్దాలు) నాటి అర అడుగు ఎత్తు ఉన్న మట్టి గణపతి బొమ్మలు బయల్పడిన విషయం తెలిపారు. గుంటూరు జిల్లా వేల్పూరులోని విష్ణుకుండిన రెండవ మాధవవర్మ క్రీ.శ.485 సంవత్సరపు శాసనంలో దంతిముఖ స్వామినమ: ప్రతిమ ప్రతిష్టాపితః శ్రీ వినాయకం నమస్యంతి అని పేర్కొనడం ద్వారా వేల్పూరులో వినాయకుడి తొలి ఆలయం ఉన్నట్లు తెలుస్తోందని శివనాగిరెడ్డి వివరించారు.