ఏపీలో హాట్స్పాట్లు ఎక్కడ..లాక్డౌన్ మినహాయింపులు ఏవి..? ఇదిగో సమగ్ర సమాచారం..!
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు నెల క్రితం అక్కడక్కడా కేవలం సింగిల్ డిజిట్లో నమోదైన కేసులు ఇప్పుడు డబుల్ డిజిట్లోకి వచ్చేశాయి. మొత్తం కేసుల సంఖ్య 15వేలకు చేరువలో ఉంది. అయితే లాక్ డౌన్,సోషల్ డిస్టెన్స్ వంటి నియంత్రణ చర్యలు భారత్ మెరుగ్గా అమలుచేస్తోందని డబ్ల్యూహెచ్ఓ ఇస్తున్న కితాబులు, పలు రాష్ట్రాల్లో డబ్లింగ్ రేటు తగ్గిందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రకటనలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కరోనా లాక్ డౌన్ పరంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర కథనం.
ఏపీలో ఇవే హాట్స్పాట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కేంద్రం హాట్ స్పాట్లుగా ప్రకటించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలన్నీ హాట్ స్పాట్స్గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 165 చోట్ల కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.ఒక కరోనా పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్లను కంటోన్మెంట్ జోన్గా పేర్కొంటున్నామని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలోని నివాసితులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అక్కడి ప్రజలకు నిత్యావసరాలను ప్రభుత్వమే అందజేస్తోంది.గుంటూరులోని కొన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజా అవసరాల రీత్యా జీడీసీసీ బ్యాంక్ సహకారంతో మొబైల్ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేశారు.
డిశ్చార్జ్ అయ్యే పేషెంట్లకు రూ.2వేలు ఆర్థికసాయం
ఏపీలో కరోనా నియంత్రణ కోసం వైద్యారోగ శాఖ ఆధ్వర్యంలో 221 కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలో 3,01,002 గృహాల్లో సర్వే నిర్వహించారు. ఆ గృహాల్లోని ప్రతీ ఒక్కరితో ప్రత్యేక వైద్య బృందాలు మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకుంటున్న వారిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కరోనా బారినపడిన వారిలో 90శాతం మంది స్మార్ట్ఫోన్లను వాడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యే పేషెంట్లకు రూ.2వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అటు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఇళ్లకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.
సౌత్కొరియా నుంచి టెస్టింగ్ కిట్లు
ఏపీలో 4 జిల్లాల్లో రాష్ట్ర స్థాయి కరోనా ఆసుపత్రులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 600 పడకలు, విశాఖలో 520 పడకలు, చిత్తూరులో504 పడకలు, నెల్లూరులో 500 పడకలతో ప్రభుత్వం ఆసుపత్రులు ఏర్పాటు చేసింది. వీటితో పాటు ప్రతీ జిల్లాలోనూ జిల్లా స్థాయి కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పేషెంట్లకు మొత్తం 8950 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవలే దాదాపు లక్ష టెస్టింగ్ కిట్లను సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. వైద్యులకు ఏవిధమైన కొరత లేదని,కొత్తగా మరికొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఏయే జిల్లాకు ఎంతమంది వైద్యులను కేటాయించారో జాబితా కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 20 తర్వాత గ్రామీణ పరిశ్రమలు,ఇసుక తవ్వకాలు,క్వారీ కార్యకలాపాలు,వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతినిచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ కథనం ప్రచురించబడే సమయానికి ఆంధ్రప్రదేశ్లో647 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మృతుల సంఖ్య 17గా రికార్డు అయ్యింది. అదే సమయంలో 65మంది కోలుకున్నారు. ఇక ఏఏ రాష్ట్రంలో ఎన్ని కేసులున్నాయి, ఎన్ని మరణాలు నమోదయ్యాయి అనే సమగ్ర వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి: