రిలయన్స్ డెయిరీని కొన్న చంద్రబాబు కుటుంబ సంస్థ 'హెరిటేజ్'
ఈ ప్రకటనతో ఒక్కసారిగా హెరిటేజ్ షేర్లకు ఊపు వచ్చింది. ప్రస్తుతం 1.71శాతం లాభాలతో 1092.20గా షేర్లు ట్రేడవుతున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ రిలయన్స్ రిటైల్(ఆర్ఆర్ఎల్)కి చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రకటన అనంతరం హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. రిలయన్స్ రిటైల్ డెయిరీ బిజినెస్ కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని హెరిటేజ్ సంస్థ గురువారం నాడు ప్రకటించింది.
కంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందిన తర్వాతే ఈ డీల్ కుదుర్చుకున్నామని సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 12నుంచి ఈ ఒప్పందం అమలులోకి రానుండగా.. రిలయన్స్ రిటైల్ దుకాణాల్లో యథావిధిగా అమ్మకాలు నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. రిలయన్స్ రిటైల్ డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేసినట్లుగా మార్కెట్ అవర్ లో ప్రకటన విడుదల చేయడం హెరిటేజ్ కు కలిసొచ్చింది.
ఈ ప్రకటనతో ఒక్కసారిగా షేర్లకు ఊపు వచ్చింది. ప్రస్తుతం 1.71శాతం లాభాలతో 1092.20గా షేర్లు ట్రేడవుతున్నాయి. 2016 డిసెంబర్ క్వార్టర్ లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభాలు 75.11శాతానికి ఎగసి 19.91కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ రిటైల్, అగ్రి, బేకరీ, రెన్యువల్ ఎనర్జీ సెగ్మెంట్లలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
ఇక రిలయన్స్ డెయిరీ విభాగం 2007నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా పాల ఉత్పత్తుల విక్రయాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే హెరిటేజ్ డెయిరీ రిలయన్స్ డెయిరీ విభాగాన్ని కొనుగోలు చేసింది.