పనామా షాక్: చంద్రబాబు సూచన, హెరిటేజ్కు మోటపర్తి రాజీనామా
హైదరాబాద్: హెరిటేజ్ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్గా ఉన్న మోటపర్తి వెంకట శివరామ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను హెరిటెజ్ సంస్ధ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ఆమోదించారు. పనామా పత్రాల్లో ఆయన పేరు కూడా ఉన్నట్లు బయటపడటంతో హెరిటేజ్ యాజమాన్యం సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని హెరిటేజ్ సంస్ధ బీఎస్ఈకి తెలియజేసింది. 'సెబి' నిబంధనల ప్రకారం ఆయా సంస్థల్లో బయటి వారిని స్వతంత్ర డైరెక్టర్గా నియమించాల్సి ఉంటుంది. దీని ప్రకారం శివరామ ప్రసాద్ను హెరిటేజ్లో స్వతంత్ర డైరెక్టర్గా నియమించారు. ఆయనకు పలు దేశాల్లో పలురకాల వ్యాపారాలు ఉన్నాయి.
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ స్వతంత్ర డైరెక్టర్గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు ఇటీవల పనామా పత్రాల్లో బయటపడిన సంగతి తెలిసిందే. ఎంపీ హోల్డింగ్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెండ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లుగా తేలింది.
పనామా పత్రాల్లో ఈయన పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, ఈక్వెడార్లో మూడు కంపెనీలు ఉన్నాయని, వీటి ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలున్నాయి. వరప్రసాద్ పేరు బయటకు రావడంతో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికర పరిస్థితిలో పడింది.
ఈ క్రమంలో ఆయన్ను రాజీనామా చేయాల్సిందిగా చంద్రబాబు కుటుంబం సూచినట్లుగా తెలుస్తోంది. వరప్రసాద్ పేరు బయటకు రావడంతో టిడిపి నేతల్లో ఆందోళన కనిపిస్తోందని సాక్షి పత్రిక పేర్కొంది. ప్రసాద్ తనయుడు సునీల్ కూడా బిట్ కెమీ వెంచర్స్లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా వెల్లడించింది.
సునీల్.. అమెరికా, హైదరాబాదులలో స్టార్టప్ కంపెనీల్లో ఈ డబ్బును పెట్టుబడి పెట్టునట్లుగా చెబుతున్నారు. ప్రసాద్ ప్రవాస భారతీయుడు కాగా.. హైదరాబాదులో కొన్ని కంపెనీలకు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు ఇతర దేశాల్లో వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ప్రసాద్ 2014 నుంచి హెరిటేజ్ ఫుడ్స్కు డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
కాగా, దీనిపై ప్రసాద్ కూడా స్పందించారు. తాను ప్రవాస భారతీయుడనని, గత 30 ఏళ్లుగా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నానని చెప్పారు. తనకు బ్రిటిష్ వర్జీన్ ఐల్యాండులో కూడా కంపెనీలు ఉన్నాయని, పనామా వ్యవహారం గురించి తనకు తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కంపెనీ సిబ్బంది, లాయర్లు చూసుకుంటారని చెప్పారు.