చిరు, పవన్లాగే అవుతారనా?: మోహన్ బాబు పొలిటికల్ రీఎంట్రీపై విష్ణు
అమరావతి: టాలీవుడ్ నటుడు, కలెక్షన్ సింగ్ మోహన్ బాబు త్వరలో తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో రాణించాలంటే మాటాలు కాదు. ఎంతో మంది రాజకీయాల్లో రాణించలేక, ఇమడలేక వాటి నుంచే వైదొలగిన సంగతి తెలిసిందే.
అయితే అలాంటివేమీ తనకు సంబంధం లేనట్లు ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నట్లు మోహన్ బాబు చెప్పారు. అయితే ఆయన ఏ రాజకీయా పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అది త్వరలోనే చెప్తానని అన్నారు. కాగా ఆయన కుమారుడు మంచు విష్ణు ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దీనిపై స్పందించారు.
"మా నాన్నగారు రాజకీయాలలో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు. ఆయన మాతో కలిసి ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకొంటున్నాను. ఇప్పటికీ నా సినిమా స్క్రిప్ట్ లను ఆయన ఓకే చేసిన తరువాతనే నేను ముందుకు వెళుతుంటాను. సినిమా రంగంలో ఆయనకున్న అనుభవం మాకు, సినీ రంగానికి ఉపయోగించాలని నేను కోరుకొంటున్నాను" అని చెప్పారు.
సినీ పరిశ్రమలో మోహన్ బాబు వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. తన తండ్రి వ్యక్తిత్వం గురించి విష్ణుకు బాగా తెలుసు కాబట్టే ఇప్పటి రాజకీయాలకు ఆయన సరిపోరని భావించి ఉండోచ్చు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన మోహన్ బాబు ప్రస్తుతం భ్రష్టు పట్టిపోయిన రాజకీయాల్లోకి ప్రవేశించి వాటికి చక్కదిద్దడం అనుమానమే.
ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన నేతలు సైతం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. నేతలు సైతం తమ స్వార్ధం కోసం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి చేరుతున్నారు. ఇలా చేరడాన్ని కొంత మంది నేతలు రాజకీయ వ్యభిచారంగా అభివర్ణిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సమాజానికి మేలు చేయడం చాలా కష్టం. మోహన్ బాబు ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే రాజకీయాలలోకి ప్రవేశించి, వాటిలో ఏదో ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని చేరితే వాటి మురికి ఆయనకి కూడా అంటకమానదు. చిన్న చిన్న నేతలు సైతం ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు.
కాబట్టి ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకొని మోహాన్ బాబు తగిన నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా తన ప్రమేయం లేకపోయినా రాజకీయానేతల విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.