విభజన కాలేదు, ఛార్జీలు తగ్గించాలి: బాబు, గెలుపుపై..
హైదరాబాద్: విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అధికారులు, సిబ్బంది విభజన జరగాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఏపీలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు అందించారు. అక్టోబర్ 2 నుండి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అమల్లోకి రానుంది. 8 ఎంవోయులపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది.
6,500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, రాయలసీమ జిల్లాల్లో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదిరింది. అనంతపురం జిల్లా ఎస్పీ కుంట మండలంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, కర్నూలు జిల్లా పాణ్యం వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, కడప జిల్లా గాలివీడులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సమర్థుడు, ఆదర్శప్రాయుడు అన్నారు. ప్రతిపాదించిన 50 రోజుల్లోనే ప్రాజెక్టులను ఓకే చేయించుకున్నారన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతుందన్నారు. వీలైనంత త్వరలో రాష్ట్రానికి నిరంతర విద్యుత్ ఇస్తామన్నారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. అధికారులు, సిబ్బంది విభజన జరగాల్సి ఉందన్నారు. విద్యుత్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో పీయూష్ గోయల్ సహకారం మరువలేమన్నారు. గతంలో క్రిసెంట్ రేటింగులో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ లోటును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గతంలో తమ ప్రభుత్వమే విద్యుత్ సంస్కరణలు తెచ్చిందన్నారు. ఏపీకి విద్యుత్ ప్రాజెక్టులు రావడం సంతోషమన్నారు. విద్యుత్ సరఫరా మార్పులను ప్రజలు గమనించాలని కోరారు. హీరో మోటోకార్ప్తో ఇవాళే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ కంపెనీతో వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. తాను వంద రోజుల పరిపాలనను సెలబ్రేట్ చేసుకోవడం లేదని బాబు చెప్పారు. రాష్ట్రంలో రూ.85వేల కోట్ల విద్యుత్ పెట్టుబడులు వస్తాయన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాల్సిన అవసరముందన్నారు.
నందిగామ ఎన్నికపై...
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఘనవిజయం సాధించడం ప్రభుత్వ వంద రోజుల పాలనపై ప్రజల తీర్పుకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వేరుగా అన్నారు.
ఈ సందర్భంగా సౌమ్యను అభినందించిన బాబు, ఆమెను గెలిపించిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రుణమాఫీ, పింఛన్ల పెంపు, నిరంతర విద్యుత్, ధరల నియంత్రణ నిర్ణయాలకు ప్రజలు ఆమోదం తెలిపారన్న దానికి నిదర్శనమే ఈ విజయం అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని, అక్కసుతో చేస్తున్నవని బాబు అన్నారు.












Click it and Unblock the Notifications