మీసం మెలేసి.. నేరుగా జగన్ను టార్గెట్ చేసిన బాలకృష్ణ, వాహనం కదలని స్థితి
నంద్యాల ఉప ఎన్నికల రోడ్డు షోలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ నేరుగా వైసిపి అధినేత జగన్ను టార్గెట్ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరు అన్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల రోడ్డు షోలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ నేరుగా వైసిపి అధినేత జగన్ను టార్గెట్ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరు అన్నారు.
ఆ ఆస్తి నీది కాదా, అధికారమంటే అంత వ్యామోహమా
ఈడీ జఫ్తు చేసిన ఆస్తులు, ఛానల్, పేపర్ వైయస్ జగన్వి కాదా అని బాలకృష్ణ ప్రశ్నించారు. అధికారం అంటే అంత వ్యామోహం ఎందుకో తెలియదని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే వారికి నంద్యాల ఉప ఎన్నికే సమాధానం కావాలన్నారు.
Recommended Video
అప్పుడే సీఎం అయినట్లుగా బెదిరింపులు
ఆస్తులు లేవని, మీడియా లేదని జగన్ చెబుతున్నారని, మరి సీబీఐ, ఈడీ జప్తుచేసిన ఆస్తులు, టీవీ ఛానల్, పత్రిక జగన్వి కావా? అని బాలకృష్ణ ప్రశ్నించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లు అధికారులను కొందరు బెదిరిస్తున్నారంటూ జగన్ను ఉద్దేశించి మాట్లాడారు.
అధికారం లేకపోయినా సేవ
అధికారం లేకపోయినా ప్రజలకు సేవ చేయవచ్చునని బాలకృష్ణ చెప్పారు. తాను ఎమ్మెల్యే కాక ముందు క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా ఉండి సేవలందించానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాకానూ కొనసాగిస్తున్నానని చెప్పారు.
దిక్సూచీ లేకుండా విభజన
పద్ధతి లేకుండా రాష్ట్ర విభజన జరిగినా చంద్రబాబు దిక్సూచిలా నిలిచారన్నారు. రాష్ట్రం విడిపోయాక రూ.16వేల లోటు బడ్జెట్, 22వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందించడంతోపాటు రైతులకు రుణమాఫీ టిడిపి చేసిందన్నారు.
చంద్రబాబు అహర్నిశలు కృషి
చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గాడిన పెట్టేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామన్నారు. కాపు, బలిజ, తెలగ సంక్షేమానికి మూడేళ్లలో రూ.2,100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
వీటి మధ్య పోటీ
నంద్యాల ఉప ఎన్నికను న్యాయానికి-అన్యాయానికి, ధర్మానికి-అధర్మానికి, నీతికి-అవినీతికి మధ్య జరుగుతున్న పోరు అని బాలకృష్ణ అన్నారు. నంద్యాల అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసిపికి, అభివృద్ధికి పాటుపడుతున్న టిడిపికి మధ్య ఈ ఎన్నిక జరుగుతోందన్నారు.
మీసం మెలేసిన బాలయ్య.. అభిమానులు, కార్యకర్తల ఉత్సాహం
బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం టిడిపి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. వెంకటేశ్వరపురం నుంచి ప్రారంభమైన బాలకృష్ణ రోడ్డు షో నంద్యాల పట్టణం, గ్రామీణం, గోస్పాడు పరిధి గ్రామాల్లో సాగింది. రోడ్ షోకు టిడిపి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో కొన్నిచోట్ల వాహనం కదలని పరిస్థితి ఏర్పడింది. బాలకృష్ణ మీసం మెలేస్తూ, సినీ డైలాగులతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.