బీజేపీని నమ్మితే మట్టే.., సాధిస్తాం : హోదాపై హీరో శివాజీ
హైదరాబాద్ : ఏపీలో ప్రత్యేక హోదా అంశం హీట్ పుట్టిస్తోంది. రాజకీయ పార్టీలన్ని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటే, చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీ లాంటి వాళ్లు హోదా కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శివాజీ ప్రత్యేక హోదాపై మరోసారి తన గొంతు వినిపించారు.
శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన శివాజీ.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కని, ఎట్టి పరిస్థితుల్లోను దాన్ని సాధించి తీరతామన్నారు. హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ తీరా ఇప్పుడు చేతులెత్తేసిందని, బీజేపీని నమ్ముకుంటే మిగిలేది మట్టి, నీళ్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలుగు వారిని మోసం చేసిన పార్టీ బీజేపీకి ముద్ర పడిపోతుందని మండిపడ్డ శివాజీ, ఏపీకి న్యాయం జరగపోతే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు.
ప్రత్యేక హోదా కోటీశ్వరుల కోసం కాదని చెప్పిన శివాజీ, భావి తరాల కోసం, విద్యార్థుల కోసం ప్రత్యేక హోదా తప్పనిసరి అన్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీయే ఏపీ ప్రజలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా ప్రాంతానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక అభిప్రాయానికి వస్తే, అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఇందుకోసం రెండు పార్టీలు కలిసి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు.
ఏపీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అవసరమైతే ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేసైనా సరే హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టబోయే ప్రైవేటు మెంబర్ బిల్లుకు పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఓటు వేయాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని చెప్తున్నవారు.. అలా చెప్పేముందు ఆ అంశాన్ని రాజ్యాగం నుంచి తొలగించాలన్నారు.
పశ్చిమగోదావరి : ప్రత్యేక హోదాపై స్పందించిన ఏపీ మంత్రి చినరాజప్ప.. హోదా కోసం ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. జగన్ దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని చినరాజప్ప సూచించారు.
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈనెల 22 తర్వాత ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉధృతం చేస్తామని, రాష్ట్రమంతటా కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాష్ట్రానికి కోట్లాది రూపాయలు ఇచ్చామని కేంద్రం చెప్పడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బునే తిరిగి రాష్ట్రానికి ఇచ్చి.. తమ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టుగా ప్రచారం చేయడం దారుణమని ఆరోపించారు రామకృష్ణ.