ప్రత్యేక హోదాపై హైకోర్టులో హీరో శివాజీ పిల్: హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై తెలుగు సినీ హీరో శివాజీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఆదేశించే హక్కు ఉందా అని హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇటువంటి కేసులు గతంలో ఏమైనా ఉన్నాయా అని కూడా అడిగింది. రాజస్తాన్ కేసును శివాజీ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. రాజస్థాన్ కేసు వివరాలను తమకు సమర్పించాలని హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శివాజీ గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్షలు కూడా చేపట్టారు. ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని పలు సందర్బాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆందోళనలు చేపట్టారు.