ఒక్కడే ఎంతని, బీజేపీ నేతలను నమ్మవద్దు: చంద్రబాబుకు హీరో శివాజీ సూచన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ను ఎలా ఉన్నత స్థాయికి తీసుకురావాలా? అని సీఎం చంద్రబాబు అహోరాత్రులు కష్టపడుతున్నారని సినీ నటుడు, ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కష్టపడుతుంటే కేంద్ర మంత్రులు, ఎంపీలకు చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన ఆరోపించారు.
సీఎం చంద్రబాబు ఒక్కడే ఎంతని కష్టపడతాని, చంద్రబాబు అంత కష్టపడుతున్నప్పుడు మిగతా వారు ఆయన కంటే ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టులు తీసుకొస్తే బాగుంటుందో కేంద్ర మంత్రులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రమంత్రులు, ఎంపీలు ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలకు తెలియదన్నారు. ఇప్పటి వరకు వారు సంపాదించింది చాలని చెప్పిన శివాజీ, ఇకనైనా రాబోయే తరాలకోసం కష్టపడాలని సూచించారు. రాజకీయ నాయకులెవరైనా అధికారంతోనే చస్తారా? అని ఆయన నిలదీశారు.
ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతలు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం మీ బిడ్డలు మాత్రమే బాగుంటే చాలా? అంటూ నిలదీశారు. ప్రత్యేకహోదా వస్తే ఏపీకి ప్రత్యేక రాయితీలు అందుతాయన్న ఆలోచన ఎవరికీ లేదని మండిపడ్డారు.
దీనిని బట్టే ప్రజా సంక్షేమం ఎవరికీ అవసరం లేదని అర్థమవుతోందన్నారు. సంపాదించుకున్నది చాలు, ఇప్పటికైనా ప్రజల కోసం ఆలోచించాలని ఆయన కేంద్ర మంత్రులకు సూచించారు. అదీ చేతకాకపోతే సీఎం చంద్రబాబుకు నిజాయతీగా సహకరించాలని ఆయన కోరారు.
బీజేపీ నేతలను నమ్మవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు శివాజీ సూచించారు. 'అయ్యా... చంద్రబాబుగారూ బీజేపీ నేతలు ఊసరవెల్లుల లాంటివారు. వారిని నమ్మకండి' అన్నారు. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారం చేపట్టిన తరువాత మరొకలా వ్యవహరించడం బీజేపీ నేతలకే చెల్లిందని విమర్శించారు.
అందుకు ఉదాహరణగా ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూను ఉదహరించారు. నేవల్ ఫ్లీట్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఫ్లీట్ అద్భుతంగా నిర్వహించారని నేవీ అధికారులను పొగిడారని, ఇన్ని ఏర్పాట్లు చేసిన చంద్రబాబును పట్టించుకోలేదన్నారు. అదే వేదిక పంచుకున్న చంద్రబాబును 'బాగా చేశావు' అని అభినందిస్తే నష్టమేంటని ఆయన అడిగారు.
ఇదే బీజేపీ అసలు స్వభావాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. నేవల్ ఫ్లీట్ నిర్వహణ కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని, ఎన్నో శాఖలను సమన్వయం చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కష్టాన్ని గుర్తించకపోతే ఎలా? అని అడిగారు. ఇలాంటి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏదో చేసేస్తారనే నమ్మకం పోతోందన్నారు. అందుకే వారిని నమ్మవద్దని చెబుతున్నానన్నారు.
చంద్రబాబు నిబద్ధతతో పనిచేస్తున్నారు
దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్దతతో పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలపై చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని అన్నారు. కుల రహిత సమాజం కాంక్షిస్తున్న దళితసంఘాలు చంద్రబాబు వ్యాఖ్యలను సానుకూల ధృక్పదంతో చూడాలన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్పై చర్చకు అంగీకరించని వైసీపీ దళితుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.