ఆ కేంద్ర మంత్రి ఆస్తులపై సుప్రీంకోర్టుకు వెళ్తా: హీరో శివాజీ
హైదరాబాద్: ఓ కేంద్రమంత్రి అక్రమంగా ఆస్తులు సంపాదించారని, ఈ విషయమై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలుగు సినీ శివాజి చెప్పారు. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన శివాజీ బుధవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ 'అయ్యా... చంద్రబాబుగారూ బీజేపీ నేతలు ఊసరవెల్లుల లాంటివారు. వారిని నమ్మకండి' అన్నారు. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారం చేపట్టిన తరువాత మరొకలా వ్యవహరించడం బీజేపీ నేతలకే చెల్లిందని ఆయన విమర్శించారు.
బీజేపీ అధికారం చేపట్టేవరకు అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర మంత్రి ఆస్తులు అకస్మాత్తుగా పెరిగాయని ఆరోపించారు. బీజేపీ అధికారం చేపట్టిన తరువాత ఆ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులోకి ధనప్రవాహం పెరిగిందన్నారు.
వీటన్నింటిపైనా సీబీఐ దర్యాప్తు చేపడితే ట్రస్టు ముసుగులో పెద్దమనుషులు వెలగబెట్టే నిర్వాకాలు బట్టబయలవుతాయన్నారు. అధికారంలో ఉన్నవారిపై కేసులు వేస్తే విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ అని తనకు తెలుసన్నారు.
ఒకవేళ తాను ఓటమిపాలైతే తాను ఇప్పటివరకు సేకరించిన వివరాలను సోషల్ మీడియాలో పెడతానని, తద్వారా ప్రజల్లోకి వెళ్తానని శివాజీ తెలిపారు. పలు పార్టీల నేతలు చెబుతున్నట్టు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసినది నేరమైతే, ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి చేస్తున్నది కూడా నేరమేనన్నారు.
మూడోసారి రాజ్యసభకు వెళ్లడానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆ కేంద్ర మంత్రి పొగుడుతున్నారని ఆరోపించారు. కక్షతోనే తనబంధువుల ఆస్తులపై ప్రభుత్వాన్ని ఉసిగొల్పుతున్నారని శివాజి మండిపడ్డారు.
ప్రత్యేకహోదాపై వెనక్కి తగ్గేది లేదని, ఏపీ ప్రజలను మోసం చేస్తున్నవారి పేర్లను బయటపెడతానన్నారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సంపాదించిన ఆస్తులపై ఓ పెద్ద ఫైల్ తయారు చేశాననన్నారు.
దానిని వామపక్ష పార్టీల ఎంపీల ద్వారా బడ్జెట్ సమావేశాల్లో చర్చించే ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. కాపులకు న్యాయం చేస్తామని అన్ని పార్టీలు మ్యానిఫెస్టోల్లో తెలిపాయని, ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం చేయండని సూచించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా ఉండరన్నారు. రాజకీయాల్లో ఉంటే కనుక మాజీ సీఎం ఎన్టీఆర్ లా బతకాలని ఆయన సూచించారు. ప్రత్యేకహోదాపై తమ ప్రయత్నం ఆగదని తెలిపిన ఆయన, ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ముద్రగడ గురించి మాకు తెలియదు
కాపు గర్జన నాడు ముద్రగడ కార్యాచరణ గురించి తమకు ముందే తెలియదని వైయస్సార్ కాంగ్రెసు నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, కన్నబాబు అన్నారు. తుని ఘటనకు తామిద్దరం కుట్ర చేశామని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించడం తగదన్నారు.
ముద్రగడ కార్యాచరణ గురించి తమకు ముందే తెలియదని, కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాము సిద్ధమని, ముద్దుకృష్ణమ అందుకు సిద్ధమా అని ద్వారంపూడి, కన్నబాబు బుధవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.