బెజవాడ అమ్మవారికి హెటిరో భారీ కానుకలు!
విజయవాడ: దసరా ఉత్సవాలు దగ్గరపడుతుండడంతో విజయవాడలో కొలువైన కనకదుర్గ అమ్మవారికి కానుకలు సమర్పించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆసక్తిచూపుతున్నారు. హెటిరో గ్రూపు తరఫున బండి పార్థసారథిరెడ్డి అమ్మవారికి భారీ కానుక సమర్పించేందుకు ముందుకు వచ్చారు.
ఇందుకోసం ాయన నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. బెజవాడ అమ్మవారికి స్వర్ణకవచం, కిరీటం, బంగారు చేతులు, ముక్కుపుడకను ఆయన తయారు చేయిస్తున్నారు.
మరోవైపు ఆర్వీఆర్ అసోసియేట్స్ కనకదుర్గమ్మ ఆలయానికి బంగారు వాకిలిని చేయిస్తోంది. దీని కోసం సదరు సంస్థ కోటి రూపాయలు ఖర్చు చేస్తోందని ఆలయ అధికారులు మీడియాకు తెలిపారు.
రూ. 50 లక్షలు ఖర్చుపెట్టి ఓ ఎన్ఆర్ఐ కుటుంబం అమ్మవారికి వజ్రాల నెక్లెస్ తయారు చేయిస్తోందని చెప్పారు. దసరా సందర్భంగా 11 రోజులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి.
ఈ సమయంలో కనకదుర్గమ్మను ఈ ఆభరణాలతో అలంకరించుతారు. మరోవైపు, డాక్టర్ అర్చన అనే మహిళ 11 రోజులు కనకదుర్గమ్మ అలంకారాల కోసం 11 పట్టు చీరలను చెన్నైలో చేయిస్తున్నారు.