అమరావతి..విజయవాడలో హైఅలెర్ట్: మొదలైన ముందస్తు అరెస్ట్ లు: వైసీపీ కౌంటర్ ప్లాన్..!
అమరావతికి మద్దతుగా సాగుతున్న ఉద్యమంలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని గ్రామాల నుంచి దుర్గగుడికి పాదయాత్రగా వెళ్లనున్న రైతులు, మహిళలు కనకదుర్గమ్మకు సారె, నైవేద్యాన్ని సమర్పించనున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ పాదయాత్ర చేసి తీరుతామని రైతులు, రైతు కూలీలు స్పష్టం చేశారు. దీంతో..అటు విజయవాడ..ఇటు అమరావ తి గ్రామాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.
ఈ ఉదయం నుండే రెండు ప్రాంతాల్లోనూ జేఏసీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇక, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగే సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఇదే సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాటాలకు ధీటుగా అధికార వైసీపీ సైతం ర్యాలీలకు సిద్దం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు ఈ రోజు నిర్వహించాలని నిర్ణయించింది.
ర్యాలీకి అనుమతి నిరాకరణ..
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ మహిళలు..రైతులు ఈ రోజు అమరావతి గ్రామాల నుండి విజయవాడ వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యాన్ని సమర్పిం చనున్నారు. అయితే, దీనికి గుంటూరు రూరల్ తో పాటుగా విజయవాడ నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 144, యాక్ట్ 30 అమల్లో ఉండటంతో ఎవరికీ నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు. అయినా..రాజధాని ప్రాంత మహిళలు..రైతులు, రైతు కూలీలు మాత్రం తాము కార్యక్రమం నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. దీంతో..అటు అమరావతి గ్రామాల పరిధిలోనూ..ఇటు బెజవాడ పరిధిలోనూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
టీడీపీ నేతల అరెస్ట్.. జేఏసీ గేటుకు తాళం..
అమరావతి గ్రామాల నుండి విజయవాడ వరకు రైతుల ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు ముందస్తు అరెస్ట్ లు ప్రారంభించారు. దీంతో..ముందుగానే విజయవాడలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బోడే ప్రసాద్..గద్దే రామ్మోహన్..బోండా ఉమా..పట్టాభి సహా పలువురిని గృహ నిర్బంధం చేశారు. బెంజ్ సర్కిల్లోని అమరావతి జేఏసీ ఆఫీసుకు తాళాలు వేశారు. జేఏసీ ఆఫీసు గేటు ఎదుట పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టారు. రాజధాని గ్రామాల్లోనూ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు మందడం, వెలగపూడి, తుళ్ళూరు గ్రామాలతో పాటు 29 గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
పోటీగా వైసీపీ నేతల ర్యాలీలు
ఇక, అమరావతి జేఏసీ కార్యాచరణలో భాగంగా ఈ రోజు రాజమండ్రిలో జరిగే సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. అదే విధంగా ప్రకాశం జిల్లాలో సభకు లోకేశ్ హాజరవుతున్నారు. అమరావతికి మద్దతుగా జేఏసీ కార్యాచరణ వేగవంతం చేయటం.. అందులో టీడీపీ నేతలు అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో..వైసీపీ కౌంటర్ ప్లాన్ అమలు చేస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనలకు మద్దతుగా వికేంద్రీకరణ ముద్దు అనే నినాదంతో అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, పోలీసులు మాత్రం అమరావతి..విజయవాడ ప్రాంతంలో ఏ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, అమరావతి జేఏసీ నేతలు మాత్రం తమ కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో..అమరావతి ప్రాంతంలో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది.