పొన్నాలకు షాకేనా?: జానాని అడగనున్న హైకమాండ్!
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు పదవీ గండం తప్పక పోవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పొన్నాలను అధిష్ఠానం సోమవారం ఢిల్లీకి పిలిపించిందంటున్నారు. పొన్నాల స్థానంలో మరో నేతను నియమించడానికి అధిష్ఠానం యోచిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చాలామంది ఆశావహులు చీఫ్ పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్ సాగిస్తున్నారట. ఇప్పటికే పార్టీ నేతలు మల్లు భట్టి విక్రమార్క, జి వివేక్, పొన్నం ప్రభాకర్, రాజయ్య ఢిల్లీకి వెళ్లి వచ్చారట. తాజాగా మరికొంత మంది కూడా పదవి కోసం ప్రయత్నాల్లో ఉన్నారట. అధిష్ఠానం పెద్దలు అకస్మాత్తుగా పొన్నాలను ఢిల్లీకి పిలిపించడంతో.. ఆయనను తప్పిస్తారనే ఊహాగానాలకు మరింత ఊపు వచ్చింది.
అంతేకాదు సీఎల్పీ నేత జానారెడ్డికి కూడా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందంట! ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు. పొన్నాలను తప్పిస్తే, ఎవరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలన్నదానిపై సీఎల్పీ నేత జానారెడ్డి అభిప్రాయం తీసుకుంటారంటున్నారు. ముందుగా పార్టీ అధ్యక్ష పదవిని ఏ వర్గానికి ఇస్తారో, ఆ సామాజిక వర్గంనుంచి ఎవరైతే బాగుంటుందో సూచించాలంటూ జానాను అధిష్ఠానం అడుగుతుండవచ్చునంటున్నారు.
అయితే ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ఆయా సామాజిక వర్గాల నుంచి పలువురు నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క, వివేక్, బీసీల నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైనారిటీల నుంచి షబ్బీర్ అలీ పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరును కూడా పరిశీలిస్తున్నారట.