సస్పెన్షన్, రోజా భవిష్యత్తు తేలేది రేపే: తమిళనాడులో ఇలా జరిగింది..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పైన హైకోర్టులో బుధవారం నాడు విచారణ సాగింది. ఇరువైపుల వాదనల అనంతరం తీర్పు గురువారానికి వాయిదా పడింది. మొదట రోజా తరఫు లాయర్, ఆ తర్వాత ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు వినిపించారు.
అంతకుముందు, నిబంధనల ప్రకారం రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం లేదని, ఒక సెషన్కు మాత్రమే చేయాల్సి ఉంటుందని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు.
340 (2) సెక్షన్ కింద ఒక సెషన్కు మాత్రమే సస్పెండ్ చేసే అవకాశముందన్నారు. సస్పెండ్ చేసే సభ్యుడి పేరును మోషన్లో మెన్షన్ చేయాలని, కానీ అలా జరగలేదన్నారు. మోషన్ సమయంలో రోజా పేరును పేర్కొనలేదని చెప్పారు. రూల్ 55 ప్రకారం సస్పెన్షన్ మోషన్ను స్పీకర్ స్క్రూటినీ చేయాలన్నారు.
కానీ అక్కడ అలా కూడా జరగలేదని చెప్పారు. రోజా సస్పెన్షన్ పూర్తిగా రూల్స్కు విరుద్ధంగా జరిగిందన్నారు. సభ్యుడి హక్కులకు భంగం కలిగినప్పుడు విచారించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందని రోజా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రోజాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడంలోను కావాలని నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు.
ఈ సందర్భంగా రోజా తరఫు న్యాయవాది.. తమిళనాడులో రాజారాంపాల్ పైన విధించిన ఏడాది సస్పెన్షన్ను రీకాల్ చేసిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రోజా తరఫు న్యాయవాది వాదనల అనంతరం విచారణ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా పడింది. కాగా, విచారణ సమయంలో కోర్టు హాలులోనే రోజా ఉన్నారు. తీర్పు విషయమై అందరూ ఉత్కంఠగా ఉన్నారు.
ప్రభుత్వ లాయర్కు హైకోర్టు ప్రశ్న
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై 194(3) నిబంధన కింద చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో బుధవారం నాడు తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు.. 340 నిబంధనను 194 విభేదిస్తుందా అని ప్రశ్నించింది. 340 నిబంధన కేవలం ఒకసెషన్కే వర్తిస్తుంది కదా అని హైకోర్టు అడిగింది. దీనికి రోజా తరఫు లాయర్ మాట్లాడుతూ.. 340 నిబంధన ఒక సెషన్కే వర్తిస్తుందన్నారు.