షరతులతో హైద్రాబాద్లో జగన్ సమైక్యసభకు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈ నెల 19న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావ సభకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం పచ్చజెండా ఊపింది. న్యాయస్థానం షరతులతో కూడిన సభకు అనుమతిని ఇచ్చింది.
మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సభను నిర్వహించుకోవాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించింది. తాము ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని పోలీసులకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇలా పదకొండు షరతులతో సమైక్య శంఖారావ సభకు ఉన్నత న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది.
కాగా, సమైక్య శంఖారావం పేరుతో ఈ నెల 19న హైదరాబాదులో సభ నిర్వహించుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి ఇటీవల దరఖాస్తు చేసుకుంది. దానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై జగన్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. సభ విషయం పోలీసులు తేల్చాల్సిన అంశమని కోర్టు సూచించింది.
పోలీసులు సమైక్య శంఖారావ సభకు అనుమతిని నిరాకరించారు. దీంతో జగన్ పార్టీ మరోసారి హైకోర్టుకు వెళ్లారు. తమ వాదన వినిపించుకునే హక్కు తమకు ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అనంతరం హైకోర్టు షరతులతో సభకు అనుమతి ఇచ్చింది.