Kurnool: న్యాయనగరిగా ఓర్వకల్లు: హైకోర్టు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు..!
కర్నూలు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత..ఆ దిశగా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేసింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. బోస్టన్ గ్రూప్ కమిటీ నివేదికా చేతికి అందింది. హైపవర్ కమిటీతోనూ సంప్రదింపులు పూర్తయ్యాయి. ఒకవంక- రాజధాని అమరావతి ప్రాంత రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ.. తాను చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసింది సర్కార్. ఇక ఈ నివేదికల మీద అధికారికంగా చర్చించబోతోంది. దీని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది.
Vijayawada: టీడీపీకి కౌంటర్: అయిదేళ్లూ ఏం చేశారు?: మూడు రాజధానుల కోసం ఉద్యమించిన వైసీపీ.. !
ఓర్వకల్లులో హైకోర్టు..
కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద హైకోర్టును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఓర్వకల్లు. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. రోడ్, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న ఓ గ్రామం ఇది. కర్నూలు విమానాశ్రయాన్ని నిర్మించింది ఈ గ్రామం పరిధిలోనే. నంద్యాల-కర్నూలు మధ్య రైల్వే లైన్ అందుబాటులో ఉంది.
అన్ని రవాణా వసతులూ ఉన్నందునే..
నాలుగు లేన్ల జాతీయ రహదారి, విమానాశ్రయం, రైల్ కనెక్టివిటీ వంటి రవాణా వసతులు అందుబాటులో ఉండటం వల్ల హైకోర్టును ఏర్పాటు చేయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై అధికారులు ఓ నివేదికను కూడా అందించినట్లు చెబుతున్నారు. ఓర్వకల్లు శివార్లలో ఖాళీ స్థలం పెద్ద ఎత్తున ఉన్నందున.. న్యాయమూర్తుల నివాసాలు, ఇతరత్రా కట్టడాలను నిర్మించడానికి ఇబ్బందులు ఉండబోవని అంటూ జిల్లా పాలనా యంత్రాంగం ఈ నివేదికలో తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
అసెంబ్లీలో ప్రకటన చేసే ఛాన్స్..
కర్నూలులో శాశ్వత హైకోర్టును ఎక్కడ నెలకొల్పుతారనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మరి కాస్సేపట్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ కమిటీ నివేదికలపై చర్చించడానికి ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆరంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే వైఎస్ జగన్.. తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది సభకు వివరించనున్నారు.
న్యాయనగరిగా తీర్చిదిద్దే ప్రయత్నం..
ఓర్వకల్లు గ్రామాన్ని న్యాయనగరిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ డీఆర్డీఓ మంజూరైంది. హెల్త్సిటీ అక్కడే ఏర్పాటు కానుంది. ఇలాంటి కొన్ని కీలక ప్రాజెక్టులు ఓర్వకల్లులోనే రూపుదిద్దుకోనున్నాయి. వాటన్నింటితో పాటు హైకోర్టు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, వాటికి అనుబంధమైన కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల ఓర్వకల్లును న్యాయనగరిగా తీర్చిదిద్దడానికి అన్ని వసుతులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.