సీట్లు పునరుద్దరించండి: హైకోర్డు, కేసీఆర్పై రేవంత్ ఫైర్
హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పునరుద్దరణ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్దించింది. దీంతో కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ సీట్లను పునరుద్దరించాలంటూ జెఎన్టీయూ హెచ్ను ఆదేశించింది. ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేసే అధికారం జేఎన్టీయూ హెచ్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
దీనిపై సింగిల్ బెంచ్ తీర్పును కోర్టు సమర్ధించింది. 174 ఇంజనీరింగ్ కాలేజీలకు సరైన వసతులు, ఫాకల్టీ లేవని ఈ కాలేజీల్లో కౌన్సిలింగ్కు అనుమతి ఇవ్వకూడదంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆయా కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి.
దీనిపై సింగిల్బెంచ్ కోర్టులో విచారణ జరిగింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను కుదిస్తూ జెఎన్టీయూ హెచ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై విశ్వవిద్యాలయం ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ నెల 25న ఇచ్చిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును నిలుపుదల చేయాలని అభ్యర్దించింది.

హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తమ వాదనలను పరిగణనలోనికి తీసుకోలేదని ధర్మాసనం ముందు వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్దానం సీట్ల కేటాయింపు విషయంలో ఏఐసీటీఈ, జెఎన్టీయూ హెచ్ మధ్య సమన్యయం లేదని వ్యాఖ్యానించింది. లోపాలు సవరించుకున్న కాలేజీలకు అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమాణాలు పాటిస్తమంటూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇంజనీరింగ్ కళాశాలలను కూడా హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ముగించింది.
రెండు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ ఒకే విధానంలో జరగాలని తెలంగాణ తెదేపా నేత రేవంత్ రెడ్డి అన్నారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉండాలన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను కుదిస్తూ ప్రవేశాల సమయంలో విద్యార్దుల జీవితాలతో ఆటలాడుతున్నారని, రాష్ట్రంలో లక్షా 80వేల సీట్లలో లక్ష సీట్లను రద్దు చేసారని అన్నారు. కేసీఆర్ నిర్ణయం వల్లనే విద్యార్దులపై రూ. 800 కోట్ల భారం పడిందని, విద్యార్దుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు.
174 ఇంజనీరింగ్ కళాశాలల అనుమతులు రద్దు చేశారని, మేనేజ్ మెంట్ కోటా ఫీజులు అడ్డగోలుగా పెంచారని అన్నారు. ప్రైవేటు కళాశాలల యజమానుల ముడుపులతో జీవోలు ఇచ్చారని, ప్రైవేటు కళాశాలల యజమానుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని అన్నారు.












Click it and Unblock the Notifications