ఏ చట్టం ప్రకారం తవ్వుతున్నారు:హైకోర్టు...కొనసాగుతున్న తవ్వకాలు
హైదరాబాద్: గుప్త నిధులున్నాయంటూ కర్నూలు జిల్లాలోని చారిత్రమైన చెన్నంపల్లికోటను ఇష్టానుసారంగా తవ్వేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. కర్నూలు జిల్లాలోని తుగ్గిలి మండలంలోని చెన్నంపల్లికోటను తవ్వేస్తున్నారంటూ వైద్యుడు బ్రహ్మారెడ్డి రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.
అయితే తొలుత చెన్నంపల్లికోటలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారని గనుల శాఖ లాయర్ అంగీకరించారు. అయితే అనంతరం వారిని తొలగించి కలెక్టర్ అనుమతితో గనుల శాఖే తవ్వకాలు జరుపుతోందని కూడా న్యాయవాది ఒప్పుకున్నారు. దీంతో ఈ విషయమై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి కె.విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది.
చెన్నంపల్లి కోటలో...మినరల్స్ ఉన్నాయా?, బంగారం ఉందా?...అనేది అసలు ఇక్కడ పాయింటే కాదని...ఏ చట్టం ప్రకారం కోటను తవ్వుతున్నారో చెప్పాలని హైకోర్టు సూటిగా అడిగింది. అయితే ఈ కోట రక్షిత కట్టడాల జాబితాలో న్యాయవాది బదులిచ్చారు. అయితే దీనిపై కలెక్టర్, పురావస్తుశాఖ, పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు బెంచ్ ఆదేశించింది. అనంతరం విచారణ 3 వారాలకు వాయిదా పడింది.
మరోవైపు చెన్నంపల్లి కోటలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మూడు నెలలుగా జరుగుతున్న ఈ తవ్వకాల్లో ఇప్పటివరకు గుప్తనిధుల జాడ లేదు. ఇప్పటివరకు ఈ తవ్వకాల్లో మట్టిదీపం, ఇనుప శూలం, ఎముకలు, గుర్రం దంతం, గుండ్రటి బండరాళ్లు, ఫిరంగి గుండ్లు వంటివి మాత్రమే వెలుగు చూశాయి. అయితే జీఎస్టీ అధికారుల నివేదిక ఆధారంగా 12 అడుగుల లోతులో గుప్త నిధులు ఉండవచ్చునని తవ్వకాల సిబ్బంది అంచనా వేస్తున్నారు. 50 మందికి పైగా పనివాళ్లతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సిసి కెమెరాల పర్యవేక్షణతో ఈ తవ్వకాలు జరుపుతుండటం గమనార్హం.