ఏపీలో కరోనా పరిస్థితిపై జగన్ సర్కార్ కు హైకోర్టు ప్రశ్నల వర్షం.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితులపై హైకోర్టులు విచారిస్తున్నాయి. ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణరాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు సీరియస్ అయింది తెలంగాణ హైకోర్టు. తాజాగాకరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా?
ఏపీ లిబర్టీ అసోసియేషన్ వేసిన పిటిషన్ పై రాష్ట్రంలోని కొవిడ్ పరిస్థితులపై నేడు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా పలు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా? అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్పత్తి కేంద్రాలను తెరిచారా ? ఇప్పుడున్న ఆక్సిజన్ నిల్వలు ఎంతకాలం సరిపోతాయి? ఇక ఆసుపత్రులలో బెడ్లు, సౌకర్యాలు సరిపడా ఉన్నాయా? అంటూ ప్రశ్నించింది.
ఐసోలేషన్ వార్డులు ఏ మేరకు ఏర్పాటు చేశారు? కరోనా టెస్టులు , రిపోర్ట్ లపై కూడా
అంతేకాదు రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితిపై కూడా వివరాలు అడిగింది . ఐసోలేషన్ వార్డులు ఏ మేరకు ఏర్పాటు చేశారు? కరోనా నిర్ధారణ టెస్టులు ఎంత మేర పెంచారు ? రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు ధర్మాసనం.కరోనా నిర్ధారణ పరీక్షలు ఆలస్యమైతే బాధితుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది .అయితే గతంలో మూడు రోజులు కరోనా నిర్ధారణ పరీక్షల రిపోర్టర్లకు పట్టేదని ,ఇప్పుడు మూడు నుండి ఐదు రోజుల్లో వస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
ఇక సమగ్ర వివరాలతో పిటిషనర్ కౌన్సిల్ తో పాటు తమకు కూడా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు, తదుపరి కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. కరోనా కేసుల తీవ్రత దేశ వ్యాప్తంగా పెరుగుతున్న దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై ఇప్పటికే కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.రేపు జరగనున్న విచారణలో కోర్టు ధర్మాసనం ఏపీలో కరోనా పరిస్థితిపై ప్రభుత్వానికి ఏం ఆదేశాలు ఇస్తుందో తెలియాల్సి ఉంది.