దివాకర్ ట్రావెల్స్కు క్లీన్చిట్ ఇస్తారా: హైకోర్టు ఫైర్, ఏపీని ఇరుకున పడేసిన తెలంగాణ
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనపై ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి క్లీన్చిట్ ఇవ్వడం పట్ల హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం నాడు విస్మయం వ్యక్తం చేసింది.
హైదరాబాద్/అమరావతి: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనపై ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి క్లీన్చిట్ ఇవ్వడం పట్ల హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం నాడు విస్మయం వ్యక్తం చేసింది.
దివాకర్ ట్రావెల్స్కు క్లీన్ చిట్ ఎలా ఇచ్చారని, మీ కౌంటర్ పేలవంగా ఉందని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ ఇలా, ఏపీ అలా
బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వేసిన కౌంటర్ అఫిడవిట్లో మోటారు వాహన చట్టం, మోటారు వాహన కార్మికుల నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రే అన్నీ సరిగానే ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ అఫిడవిట్ ఏపీని హైకోర్టు ప్రశ్నించేలా చేసిందని చెప్పవచ్చు.
ఏపీ అఫిడవిట్పై సందేహాలు
ఈ రెండు అఫిడవిట్లను పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజనిలతో కూడిన ధర్మాసనం ఏపీ అఫిడవిట్పై పలు సందేహాలు వ్యక్తం చేసింది.
హైదరాబాదులో ఉన్నందునే..
దీనిపై ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దివాకర్ ట్రావెల్స్ బస్సు కార్యాలయం హైదరాబాదులో ఉన్నందునే వారు అలా చెప్పారన్నారు. కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు.
Recommended Video
కౌంటర్ పేలవం.. మూడు వారాల సమయం
కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏపీ కౌంటర్ అఫిడవిట్ను పరిశీలించిన ధర్మాసనం ఈ కౌంటర్ పేలవంగా ఉందని పేర్కొంది. పూర్తి విషయాలు వెల్లడించకుండా కొన్నింటిని మరుగుపర్చేలా ఉందని అసహనం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును నిరాకరించింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల సమయం ఇచ్చింది.