ఏబీవీ కేసు నుంచి తప్పుకున్న న్యాయమూర్తి..!!
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందనరావు తప్పుకొన్నారు. భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కేసు దాఖలు చేసారు. ముందు.. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని ఏబీవీ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
ఈ వ్యాజ్యం తాను విచారించలేనని, ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచి ఆయన అనుమతి మేరకు మరో న్యాయమూర్తి ముందు ఉంచాలని జస్టిస్ ఆర్. రఘునందనరావు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ వ్యాజ్యంపై గతంలో మరో న్యాయమూర్తి విచారణ జరిపారు. హైకోర్టులో తాజాగా రోష్టర్ విధానం మారటంతో ఈ వ్యాజ్యం రఘునందనరావు పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు ప్రారంభ సమయంలో ఏబీవీ తరపున న్యాయవాది ఈ వ్యాజ్యంపై విచారణ జరపాలని కోరారు. దీని పైన స్పందించిన న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
భద్రత-నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత ఏడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీవీ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసారు. ఇప్పటికే ఏబీ వేంకటేశ్వర రావు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన గతంలో తన సస్పెన్షన్ వ్యవహారం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తన పైన తీసుకున్న చర్యల పైన ఇప్పటికే ఏబీవీ పలు అంశాల్లో న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు.