చంద్రబాబు-లోకేష్ అవినీతిపై ఆధారాల్లేవు: హైకోర్టులో పిల్ ఉపసంహరణ
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పైన దాఖలైన వ్యాజ్యాన్ని పిటిషనర్ బుధవారం వెనక్కి తీసుకున్నారు. ఐటీ కంపెనీల పేరుతో అక్రమాలు జరిగాయని మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ విధంగా వేల కోట్ల అవినీతి పాల్పడ్డారు!...చంద్రబాబు, లోకేష్ లపై హైకోర్టులో పిల్
విచారణార్హతను పరిశీలించిన న్యాయస్థానం, అవినీతి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. పూర్తి ఆధారాలతో రావాలని పిటిషనర్కు కోర్టు సూచించింది. ఆధారాలు లేకుండా పిటిషన్లు వేస్తే విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. దీంతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఆధారాలు లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని పిల్ వేసిన వ్యక్తిని కోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్ రాజకీయంగా వేసిన పిటిషన్లా ఉందని పేర్కొంది. రాజకీయాలు బయట చూసుకోవాలని, కోర్టు సమయాన్ని వృథా జేయవద్దని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.