సస్పెన్స్ కంటిన్యూ -జెడ్పీటీసీ ఫలితాల వెల్లడిపై వాదనలు పూర్తి : హైకోర్టు తీర్పు రిజర్వ్..!!
ఏపీలో జరిగిన జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ పిటీషన్ పైన వాదనలు ముగిసాయి. దీని పైన తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. గతంలో ఇదే ఆదేశాల పైన స్టే ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్ లో పూర్తి స్థాయి విచారణ జరిగింది. సుప్రీం ఆదేశాలు పాటించలేదంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ను సింగిల్ బెంచ్ ఏపీ హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఎన్నికల నిర్వహణలో జరిగింది ఇదీ..
మున్సిపల్ ఎలక్షన్ కు నాలుగు వారాల ఎన్నికల నియమావళిని కోడ్ అమలు చేయలేదని..మున్సిపల్ ఎన్నికలకు 22 రోజులు మాత్రమే ఎన్నికల నియమావళి కోడ్ అమలు చేశారని వివరించారు. పంచాయతీ ఎన్నికలు కూడా 26 రోజులు మాత్రమే ఎన్నికల నియమావళి కోడ్ అమల్లో ఉందని గుర్తు చేసారు. ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడినుంచి మొదలయ్యాయని కోర్టుకు నివేదించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పై రెండు పిటిషన్లు దాఖలయ్యాయని.. నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళి కోడ్ అడిగిన పిటీషన్ ను కొట్టేశారని వివరించారు.
నిబంధనలు ఉల్లంఘన జరగలేదు..
ఎన్నికల నియమావళి కోడ్ గురించి అడగని పిటిషన్ పై సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని.. సుప్రీం కోర్ట్ చెప్పిన నాలుగు వారాల ఎన్నికల నియమావళి కోడ్ ప్రతి ఎన్నికల్లోనూ అమలు చేయాలన్న భావంతో ఇవ్వలేదని కోర్టుకు నివేదించారు. ఆర్టికల్ 142 ప్రకారము దేశంలోని అన్ని ఎన్నికల్లో నాలుగు వారాలు ఎన్నికల నియమావళి కోడ్ వర్తించదని చెప్పుకొచ్చారు. 2021 జనవరి 8 తేదీ నుంచి 10 మార్చి 2021 వరకు సుప్రీంకోర్టు చెప్పిన నాలుగు వారాల స్దానిక సంస్ధల ఎన్నికల నియమావళి కోడ్ పూర్తయిందని కోర్టు ముందు తన వాదనల్లో భాగంగా వినిపించారు.
ఏ ఒక్క ఫిర్యాదు రాలేదు..
ఇక, ఈ సమయంలోనే పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల నియమావళి కోడ్ అమలు చేయమని ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సంఘాన్ని అడగలేదని..నాలుగు వారాల ఎన్నికల నియమావళి కోడ్ పై ఏ ఒక్క ఓటరు కోర్టుకు ఫిర్యాదు చెయ్యలేదని కోర్టుకు నివేదించారు. ఫిర్యాదు లేకుండా ఎన్నికల నియమావళి కోడ్ పై ఉపశమనం ఇవ్వటం సమంజసం కాదని ఆయన కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణలో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులను కోర్టు ముందు ఉంచారు.
ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్..
ఏప్రిల్ 8న జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 10న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, కోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగినా..ఫలితాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇక, ఇప్పుడు హై కోర్టు డివిజన్ బెంచ్ ముందు ఎన్నికల సంఘం- ప్రభుత్వం వాదనలు పూర్తయ్యాయి. ఇద్దరి తరపున వాదనలు విన్న తరువాత తుది తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. దీంతో.. పోటీ చేసిన అభ్యర్ధుల్లో మరి కొద్ది రోజులు నిరీక్షణ- సస్పెన్స్ తప్పేలా లేవు.