సమ్మె అక్రమం: ఆర్టీసి కార్మికులకు హైకోర్టు షాక్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సమ్మె అక్రమమని తేల్చి చెప్పింది. వెంటనే విధుల్లోకి హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. సిఎల్ వెంకట్రావ్ వేసిన పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే, ఆర్టీసి సమ్మెపై రెండు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి.
తెలుగుదేశం పార్టీ నేత సిఎల్ వెంకట్రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సమ్మెను విరమించేలా చూడాలని ఆయన హైకోర్టును కోరారు. ఆర్టీసి సమ్మెపై కమిటీ వేయాలని కోరుతూ మొహమ్మద్ గౌస్ అనే చిత్తూరు జిల్లావాసి పిల్ దాఖలు చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను, ఆర్టీసి యూనియన్లను, యాజమాన్యాన్ని పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు.