వాస్తవాలను తేల్చమంటారా - వారికంటే గొప్పవారా: జవహర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం..!!
సీనియర్ ఐఏఎస్ అధికారి..ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో గైర్హాజరు కావటంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందు హాజరయ్యే సమయం లేదా అని ప్రశ్నించారు. నిరంతరం సమావేశాలు ఉంటాయా అంటూ నిలదీసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రోజుకు ఎన్ని గంటలు సమావేశాల్లో పాల్గొంటారో సీఎం పేషీ నుంచి వివరాలు తెప్పించి వాస్తవాలను తేల్చమంటారా అంటూ వ్యాఖ్యానించింది.

వారి కంటే గొప్పవారనుకుంటున్నారా
మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి మహనీయులే న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి కోర్టుల్లో హాజరయ్యారని, వారికన్నా మీరు గొప్పా అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఐఏఎస్ జవహర్రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ పైన కోర్టు స్పందించింది. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఏమీ కాదనే భావనతో ఉండొద్దని హితవు పలికింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదనే భవిష్యత్ లో గుర్తిస్తే వివరణ తీసుకోకుండానే నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేస్తామంటూ హైకోర్టు హెచ్చరించింది.

మరోసారి ఇలా జరిగితే
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఆదేశాలు జారీ చేశారు. ఒక ఉద్యోగి తన వేతన బకాయిలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు ను ఆశ్రయించారు. దీని పైన బకాయిలను చెల్లించాలని గత నవంబర్ లో కోర్టు ఆదేశించింది. కానీ, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. దీంతో.. అప్పటి ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డితో పాటుగా మరి కొంత మంది అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సమావేశం ఉందని పేర్కొంటూ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఐఏఎస్ అధికారి జవహర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందులో సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో పేర్కొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులను అరెస్టు చేయాలని వారెంట్ జారీ చేస్తేనో, విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తేనో కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నారంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఇతర సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications