ప్రభుత్వానికి హైకోర్టు షాక్: పీపీఏల సమీక్ష్ జీవో రద్దు: ఆరు నెలల్లోగా తేల్చాలి..!
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన సమీక్ష చేయాలనే జగన్ ప్రభుత్వం నిర్ణయం పైన హైకోర్టు కీలక సూచనలు చేసింది. గతంలో దీని పైన అటు కేంద్రం నుండి వ్యాపార ప్రముఖల వరకు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఇదే వ్యవహారం పైన విద్యుత్ సంస్థలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. దీని పైన విచారణ చేపట్టని హైకోర్టు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో ఇకపై పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్సీ ఎదుటే వినిపించాలని హైకోర్టు సూచించింది.
ప్రభుత్వ జీవో కొట్టివేత..
ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన సమీక్ష చేయాలని నిర్ణయించింది. దీని పైన అసెంబ్లీ సమావేశాల్లోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఏ విధంగా అందులో అవినీతి జరిగింది వివరించారు. అయితే..ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీని పైన కేంద్ర ప్రభుత్వం మొదలు జపాన్ తో సహా పలువురు పారిశ్రామిక వేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. స్వయంగా కేంద్ర మంత్రి పీపీఏల్లో అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసారు.

ఇదే సమయంలో పీపీఏలు కోర్టును ఆశ్రయించాయి. దీని పైన విచారణ చేసిన ఏపీ హైకోర్టు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 63ను కొట్టి వేసింది. దీంతో పాటుగా పీపీఏలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈఆర్సీలో పరిష్కరించుకోవాలి..
పీపీఏల వివాదాన్ని ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి, పీపీఏలకు హైకోర్టు సూచించింది. ఆరు నెలల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో విద్యుత్ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని సర్కార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా.. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లపై పునఃసమీక్షకోసం ఏపీఈఆర్సీకి వెళ్తామంటూ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. ఇకపై పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్సీ ఎదుటే వినిపించాలని హైకోర్టు సూచించింది.
ఏపీఈఆర్సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ధారించలేమని హైకోర్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్సీకి స్పష్టం చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్కు రూ. 2.43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టంప్రకారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ను తిరిగి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications