బాబు చెప్పినట్లు.. లీకేజీయే!: రోజంతా 'స్పెషల్' డ్రామా, ఎత్తుగడనా?
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కథ కంచికి చేరింది! ఏపీకి హోదా ఇవ్వడం లేదని, దానితో సమానమైన ప్యాకేజీ ఇస్తున్నారని, ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్యలు ప్రకటన చేస్తారని నిన్న సాయంత్రం నుంచి జోరుగా వార్తలు వచ్చాయి.
అయతే, మధ్యాహ్నం వరకు జోరుగా వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఒక్కసారిగా చల్లబడింది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి, ఎంపీ హరిబాబు, ఏపీ శాసన సభా పక్ష నేత విష్ణువర్ధన్ రెడ్డి మీడియా ప్రకటనతోనే అంతా ముగిసిందని అర్థమైంది.
చంద్రబాబు చెప్పినట్లుగానే..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్యాకేజీ అంతా లీకేజీనే అని సీనియర్ మంత్రులతో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లుగానే ఇది లీకేజీనే అని అర్థమవుతోందని అంటున్నారు.
ఎందుకు ఇలా?
హోదా లేదని, ప్యాకేజీ మాత్రం దానికి సమానంగా ఉంటుందనేది కేవలం లీక్ మాత్రమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఓ కారణం కూడా ఉందని అంటున్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ అంటే ఏపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసేందుకే ఇలాంటి ఎత్తుగడ వేశారేమో అని అంటున్నారు.
చంద్రబాబు డిమాండ్లతో ఆగిందా?
కేంద్రమంత్రులతో వరుస భేటీలు జరిపి, హోదా స్థానంలో అంతకన్నా ఎక్కువ లాభం కలిగించే ప్యాకేజీని తయారు చేశామని చెబుతూ... సీఎం చంద్రబాబును ఢిల్లీకి రావాలని ఆహ్వానించిన కేంద్రం, ఈ కథను క్లైమాక్స్కు చేర్చినట్టే కనిపించిందని, కానీ చంద్రబాబు డిమాండ్ల నేపథ్యంలో ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు.
నిర్మలా సీతారామన్ ప్రకటన
ఏపీ బీజేపీ నేతలతో పాటు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా హోదా, ప్యాకేజీ అంశంపై స్పందించారు. హోదా పైన తమ వైఖరి రాజ్యసభలోనే చెప్పామని, జైట్లీ, వెంకయ్యలు స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. విభజన హామీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు.
రాత్రి నుంచి హైడ్రామా ఇదీ..
ఏపీకి హోదా లేదని, దానికి సమానమైన ప్యాకేజీ వస్తుందని మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం దాకా హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు జైట్లీ, వెంకయ్యలు ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అంతకుముందు సుజన కేంద్రమంత్రులతో చర్చలు జరపడం చర్చకు దారి తీసింది. అంతేకాదు, చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, అది పిలుపు కాకపోవచ్చునని, సంప్రదింపులు జరిపి ఉంటారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ సభ నుంచి మొదలు..
పదిహేను రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తిరుపతిలో హోదాపై సభ పెట్టారు. అప్పటి నుంచి ఢిల్లీలో హంగామా ప్రారంభమైంది. గత వారం పది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలపై సస్పెన్స్కు తెరదించేలా సంకేతాలు ఇస్తూ, హడావుడిగా కదిలినట్లుగా కనిపించింది. కానీ చివరకు కథ మళ్లీ మొదటకు వచ్చింది.
మున్సిపల్ ఎన్నికల ట్విస్ట్
ప్రజల్లో నెలకొన్న హోదా సెంటిమెంట్కు ఎసరు పెడితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు.. ప్యాకేజీకి తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. అదే సమయంలో త్వరలో కార్పొరేషన్లు, మునిసిపల్ ఎన్నికలు జరగనున్న సమయంలో హోదా రాలేదని తెలిస్తే, ప్రజల ఓట్లు అధికార పార్టీకి పడే అవకాశం ఉండదన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది.
ఎన్నో అనుమానాలు, ఎన్నో కారణాలు
మొత్తానికి హోదా రాదంటే ఏపీ స్పందన తెలుసుకునేందుకు బీజేపీ లీకులు ఇచ్చి ఉంటుందా? మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆగిపోయారా? చంద్రబాబు ప్యాకేజీతో పాటు హోదా కోసం పట్టుబట్టడం వల్లే ఈ ప్రతిష్టంభనా? లేదా చంద్రబాబు అంగీకరించకుండా ప్యాకేజీ ప్రకటన చేస్తే లాభం లేదని బీజేపీ భావించిందా? అనే చర్చ సాగుతోంది.