సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత
ఈనెల 5న విడుదలైన కానిస్టేబుల్ అర్హత పరీక్షలో కేవలం 99వేలమందే ఉత్తీర్ణులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వెయ్యి మందికిపైగా కానిస్టేబుల్ అభ్యర్థులు ముట్టడికి వస్తున్నట్లు సమాచారం రావడంతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతం, పాత టోల్గేట్, సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసులను మొహరించారు. తాడేపల్లి వస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించాలనే డిమాండ్తో గత కొన్ని రోజులుగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులకు ఐదు మార్కులు కలిపితే క్వాలిఫై అవుతామని వారు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ను ఈ ఏడాది జనవరి 22న నిర్వహించారు. 4,58,219 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా ఫలితాలు ఈనెల 5న విడుదలయ్యాయి. 99వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 4,58,219 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో కేవలం 95,208 మంది మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత సాధించారు. వీరికి ఈవెంట్స్ నిర్వహించి.. అందులో అర్హత సాధించినవారికి మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. జనవరి 22న ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షను రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించింది.












Click it and Unblock the Notifications