బీ అలర్ట్, వర్షాకాలమే అయినా - మరో వారం తప్పదు..!!
భారీ వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గత వారం వరకు భారీ వర్షాలతో తడిసి ముద్దయినా..వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది వర్షాకాలమా. వేసవి కాలమా అనే సందేహం ప్రజలలో వ్యక్తమవుతోంది. భారీ వర్షాలు కురవాల్సిన సమయంలో మబ్బులు పట్టిన ఎండ తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటోంది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో వారం రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా మారే వాతావరణం లేకపోవడంతో కోస్తాలో అనేక ప్రాంతాల్లో వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి.

ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదు అతున్నాయి. గడచిన రెండు రోజుల నుంచి పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వేడి వాతావరణం నెలకొనడంతో ఖరీఫ్ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మెట్ట ప్రాంతాల్లో పంటల సాగు అనుకున్నంతగా జరగడం లేదు. నాలుగు రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యంగా పయనించడంతో రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. దీనికితోడు ఈ సీజన్లో వర్షాలకు దోహదపడే రుతుపవనద్రోణి తూర్పుభాగం నాలుగు రోజుల క్రితమే ఉత్తరాది వైపు మళ్లింది.
రానున్న మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనద్రోణి హిమాలయ పర్వత ప్రాంతాల వైపు వెళ్లనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో మరో ఐదారు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎండ తీవ్రతకు సాయంత్రానికి మేఘాలు ఏర్పడి అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి తప్ప విస్తారంగా వర్షాలు పడే వాతావరణం లేదన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రుతుపవనద్రోణి దక్షిణాది వైపు వస్తేనే వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ ఏజెన్సీలు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు కురిసే వరకు ఎండలు కొనసాగుతాయని వాతావరణ నిపుణలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications