నిరుద్యోగంలో దక్షిణాదిలో ఏపీ టాప్... వైసీపీ మోసపూరిత హామీలతో రోడ్ల మీదకు యువత : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. సుమారు కోటి మంది కరోనా కారణంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 2.3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. వైసీపీ నేతల మోసపూరిత హామీల కారణంగా యువత రోడ్ల మీదకు వస్తోందన్నారు. సోమవారం(జూన్ 21) పార్టీ సీనియర్ నేతలతో వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
రైతులకు చెల్లించాల్సిన రూ.3600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, రైతులు చేసే ఉత్పత్తులన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో ఆస్తి పన్ను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కరోనాను ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు.రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.10వేలు చొప్పున సాయం అందించాలన్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తన దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇన్చార్జిలు నిరసన దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇది జాబ్ క్యాలెండర్ కాదని... డాబు క్యాలెండర్ అని టీడీపీ విమర్శిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను ముంచారని మండిపడుతోంది.
Recommended Video
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థి సంఘాలు సైతం ఈ జాబ్ క్యాలెండర్పై నిరసన వ్యక్తం చేశాయి. జాబ్ క్యాలెండర్ బోగస్ అని, తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.ఆర్టీసీని విలీనం చేసి 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడమేంటని ప్రశ్నించారు.గౌరవవేతనం కింద పనిచేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారని నిలదీశారు.వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.