నా విశ్వరూపం చూపిస్తా: బాలకృష్ణ వార్నింగ్, 'నా గురించి ఫేస్బుక్లో పెడతావా అని అరిచి, గెంటించారు'
హిందూపురం: మీరు తీరు మార్చుకోకుంటే తాట తీస్తానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని చిలమత్తూరు మండల టీడీపీ నేతలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. హిందూపురంలో చిలమత్తూరు మండలం నేతలతో పంచాయతీల వారీగా ఆయన సమావేశమయ్యారు.
ఇక పని మొదలు, ప్లానే కాదు నిర్మాణంలోను సింగపూర్: బాబు, ఈ ఒప్పందంతో ఏపీకి నష్టమని ఆందోళన
ఈ సందర్భంగా గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల గురించి నేతలు బాలకృష్ణకు వివరించారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నా తమకు సరైన గుర్తింపు లభించడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను కొందరే పంచుకుంటున్నారని, కార్యకర్తల మంచిచెడ్డలు పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. దీంతో బాలకృష్ణ స్పందించారు.
నా విశ్వరూపం చూస్తారు
ఇకపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారిస్తానని బాలకృష్ణ చెప్పారు. ఇప్పటి వరకు జరిగిపోయినదాన్ని నేతలు, కార్యకర్తలు మరచిపోవాలని, ఇకపై అందరూ కలసి పని చేయాలన్నారు. లేకపోతే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా పని చేయాలని సూచించారు. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
ఓ యువకుడిపై బాలకృష్ణ ఆగ్రహం
ఇదిలా ఉండగా ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తమ ఊరి సమస్యను చెప్పుకునేందుకు బాలకృష్ణ వద్దకు రాగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సదరు యువకుడు ఓ ఛానల్తో మాట్లాడారు. ఆ కార్యకర్త పేరు బాలాజీ. అయితే అతడు టీడీపీ కార్యకర్తనా లేదా కచ్చితంగా తెలియరాలేదు.
పోలీసులతో గెంటించారు
గ్రామ రోడ్డు సమస్య వద్దకు బాలకృష్ణ వద్దకు వెళ్లగా, పోలీసులతో గెంటించారని చెబుతున్నారు. ఈ మేరకు బాలాజీ మాట్లాడుతూ..తమ గ్రామ సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశమివ్వరా అని అతను వాపోయారు. మా ఊరి రోడ్డు చాలా దారుణంగా ఉందని, బంకమట్టి వేశారన్నారు. కనీసం వర్షాలు వస్తే ఆటోలు కూడా రాని పరిస్థితి అన్నారు.
నా గురించి నువ్వు ఫేస్బుక్లో పెడతావా అని అరిచారంటూ
ఈ రోడ్ల పరిస్థితిని తాను ఫేస్బుక్లో పెట్టానని, ఆ తర్వాత నియోజకవర్గానికి వచ్చిన బాలకృష్ణకు ఫోటోలు చూపించి సమస్యను పరిష్కరించాలని కోరితే, ఆయన తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నా గురించి నువ్వు ఫేస్బుక్లో పెడతావా అని అరిచారని, ఇది ఎంత వరకు న్యాయమని, ఓటు వేసిన తమకు ప్రశ్నించే హక్కు లేదా అన్నారు.