ఏపీలో విద్యుత్ కోతలు లేవన్న మంత్రి సుచరిత .. జనాలు భ్రమ పడుతున్నారా అని ప్రశ్నిస్తున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత విద్యుత్ కోతలపై అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. వేసవి కాలం , వర్షా కాలం అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఒక పక్క సామాన్య ప్రజలు, ప్రతిపక్షాల నాయకులు అంటుంటే అబ్బే అలాంటిదేమీ లేదని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అంటున్నారు. అసలు విద్యుత్ కోతలు లేవని, ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్య చేశారు మంత్రి మేకతోటి సుచరిత .
Recommended Video


గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే గణనీయంగా విద్యుత్ అంతరాయ శాతాన్ని తగ్గించామంటున్న మంత్రి సుచరిత
గుంటూరులో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆమె విద్యుత్ సరఫరా వేళలను వివరించారు. గృహ అవసరాలకు నిరంతరాయంగా, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వర్షాకాలంలో చెట్లు పడిపోవడం, తీగలు తెగిపోవడం వంటి కారణాలతో స్వల్ప అంతరాయం ఏర్పడుతోందని.. వీటిని విద్యుత్ కోతలుగా భావించరాదని ఆమె పేర్కొన్నారు . విద్యుత్ అంతరాయ శాతాన్ని గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గించగలిగామని సుచరిత తెలిపారు . ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ అందిస్తోందని.. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని వివరించారు

విద్యుత్ కోతలపై జనాల ఆందోళన అంతా భ్రమంటారా .. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ
ఇక మంత్రి సుచరిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ప్రజలు రోడ్ల మీదకు రావడం మనం చూశాం. బహుశా వారంతా కూడా ప్రతిపక్షాల కుట్ర వల్ల తమ ఇళ్ళలో కరెంటు లేదని భ్రమపడుతున్నారేమో అని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో సోలార్, పవన విద్యుత్ ఉత్పాదన కాంట్రాక్టులపై సమీక్షలు చేస్తూ విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ సర్కార్ కంపెనీలకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఇక సదరు విద్యుత్ కంపెనీలు కోరును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తెలంగాణా రాష్ట్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ .. కోతలకు కారణం అదేనా ?
అదే సమయంలో చంద్రబాబు హయాంలో తెలంగాణాకు విద్యుత్ బకాయిల కారణంగా ఆపేసిన విద్యుత్ సరఫరా జగన్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దాదాపుగా 2014-15 నాటి స్థాయికి విద్యుత్ సరఫరా తెలంగాణా రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం పునరుద్దించింది. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత ఉందని పలువురి ఆరోపణ. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేస్తుంటే కరెంట్ ఉన్నా లేదని ప్రజలు ఆందోళన చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఏది ఏమైనా కరెంట్ కోతలపై ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications