డ్రగ్స్ గుజరాత్ లో దొరికాయని ప్రధాని మోడీకి లింక్ పెడతారా? జగన్ కు డ్రగ్స్ అంటగట్టటంపై హోం మంత్రి సీరియస్!!
ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై డ్రగ్స్ వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్ జగన్ అంటూ బురద జల్లడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. డ్రగ్స్ దిగుమతి అడ్రస్ విజయవాడ పేరుతో ఉన్నంత మాత్రాన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎలా నిందిస్తారని ప్రశ్నించిన ఆమె ఇలా ఓ సీఎం పై నిందలు వేయడం దారుణమని అభిప్రాయపడ్డారు.
తాలిబన్లతో రాష్ట్రానికి సంబంధం అర్ధరహితం
గుంటూరు జిజిహెచ్ లో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్ ప్లాంట్స్ ను ప్రారంభించిన మంత్రి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిచ్చారు. తాలిబన్ల డ్రగ్స్ కు తాడేపల్లికి లింక్ ఏంటి అంటూ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాలిబన్లతో రాష్ట్రానికి సంబంధం అంటగడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని మేకతోటి సుచరిత కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలాగా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని మంత్రి సుచరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ప్రతిష్ట దిగజార్చేలా విమర్శలు
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి విక్రయం, వినియోగం పై ఉక్కుపాదం మోపుతున్నామని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్ఈబీ అధికారులు గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేలాగా ప్రతిపక్షాల తీరు ఉందని, ప్రజలు మళ్లీ తమ ముఖం చూడరేమో అన్న భయంతోనే ప్రతిపక్షాలు ఈ తరహా విమర్శలకు దిగుతున్నారని, బట్ట కాల్చి మీద వేసినట్టు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయి అని మేకతోటి సుచరిత అభిప్రాయపడ్డారు.
దేశంలోకి డ్రగ్స్ రాకుండా చూడాల్సింది కేంద్రం
విజయవాడ అడ్రస్ పేరుతో డ్రగ్స్ దిగుమతి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలు మరి గుజరాత్ లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోడీకి లింకు పెడతారా అంటూ ప్రశ్నించారు. దేశంలోకి డ్రగ్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వమే ముందుగా చర్యలు తీసుకోవాలని మేకతోటి సుచరిత కోరారు. దేశంలోకి డ్రగ్స్ రావడం, పెద్ద ఎత్తున డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగడం అందరి వైఫల్యంగా చూడాలని అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాలను నివారించటం, నియంత్రించటం ఒక్క ప్రభుత్వాల కర్తవ్యమే కాదని, ప్రజల కర్తవ్యం కూడా అంటూ హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రభుత్వాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని సుచరిత తేల్చిచెప్పారు. జగన్ ని విమర్శించడానికి ఏమాత్రం అవకాశం లేక కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.
Recommended Video
డ్రగ్స్ వ్యవహారంలో జగన్ ను వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్న టీడీపీ
ఇదిలా ఉంటే డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలో ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో డ్రగ్స్ వెనుక బిగ్ బాస్ ఎవరు ? కింగ్ పిన్ ఎవరు ? తాలిబన్ డ్రగ్స్ కి తాడేపల్లి కి లింక్ ఏంటి ? ఏపీలో డ్రగ్స్ మాఫియా వెనుక వైసీపీ నేతలు ..జగన్ కనుసన్నల్లోనే డ్రగ్స్ మాఫియా అంటూ టిడిపి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వ్యవహారంతో సీఎంకు లింకులు ఉన్నాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విదేశీ టూర్లకు మర్మం ఏంటి అని ప్రశ్నిస్తూ ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకు విస్తరించారని మండిపడ్డారు.