'టెక్కీ' పరువు హత్యలో ట్విస్ట్: ఆవేశంలోనే చంపేశారట
గుంటూరు: గుంటూరు జిల్లా నవ వధువు దీప్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను వారి బంధువులు సోమవారం పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారని సమాచారం.
విచారణలో వారు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు... ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు గుంటూరుకు వచ్చిన దీప్తి, తన తల్లిదండ్రులతో కలిసి రాజేంద్రనగర్లోని ఇంటికి చేరుకుంది. తల్లి సామ్రాజ్యం స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో దీప్తితో మాట్లాడుతూ.. కులాంతర వివాహంపై దీప్తి, తండ్రి మధ్య వాగ్వాదం జరిగింది. మీకు ఇష్టం లేకుంటే తాను ఇంటికి రానని దీప్తి తండ్రికి చెప్పింది.
దీంతో ఆగ్రహం పట్టలేని తండ్రి ఆమె రెండు చెంపల పైన కొట్టాడు. ప్రమాదవశాత్తు కణతపై గట్టిగా తగలడంతో దీప్తి మృతి చెందింది. ఏం చేయాలో తెలియక ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకే చున్నీతో మంచానికి కట్టారు. స్నానం చేసి వచ్చిన తల్లి కుమార్తె చనిపోయి ఉండటం గమనించి కేకలు వేసింది. తండ్రి ఆమెను వారించి బైక్ పైన పారిపోయారు. అయితే, హరిబాబు చెప్పినదాంట్లో వాస్తవం ఎంతుందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, దీప్తి తన తల్లిదండ్రుల బాగోగుల కోసం ఎంతగానే చూసేదని, తన తల్లిదండ్రుల గురించి కిరణ్ కుమార్కు ఆమె ముందే వివరించి, వారికి కొన్నాళ్ల పాటు తన వేతనం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిందని కిరణ్ తండ్రి నాగ సత్యనారాయణ చెప్పారు.
మీడియా ముందుకు
దీప్తి హత్య కేసులో తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను పోలీసులు మంగళవారం ఉదయం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీనిపై నిందితులు మాట్లాడుతూ తమ కూతురు తమన నమ్మించి మోసం చేసి వివాహం చేసుకుందని, ఆ ఆవేదనను తట్టులేక తాము ఈ అఘాయిత్యానికి పాల్పడ్డామని తెలిపారు. కూతురి మరణానంతరం తీవ్ర క్షోభకు గురై తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చిందని అయితే బంధువులు ఆపడంతో పోలీసుల ఎదుట లొంగిపోయామన్నారు.