మంత్రి పేర్ని నానితో దిల్ రాజు టీం భేటీ - సీఎంతో నాగార్జున : చిరంజీవి లేకుండానే- నిర్ణయాలు...!!
టాలీవుడ్ ప్రముఖులు వరుసగా ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యులను కలుస్తున్నారు. ప్రముఖ హీరో నాగార్జున ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీ అంశాల పైన చర్చించారనే ప్రచారం జరగ్గా...పూర్తిగా నాగార్జున వ్యక్తిగత అంశాల పైనే మాట్లాడారంటూ సీఎంఓ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాగార్జున సైతం సీఎం జగన్ శ్రేయోభిలాషిగా వచ్చి కలిసానని..చాలా రోజులు కావటంతో ఈ రోజున లంచ్ చేస్తూ మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక, ఇది ముగిసిన 24 గంటల్లోనే ఈరోజు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రభుత్వంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీలు
పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా వివాదం నడుస్తున్న సమయంలో దిల్ రాజ్ మరి కొంత మంది నిర్మాతలతో కలిసి బందులో పేర్ని నానితో సమావేశమయ్యారు. ఎవరి వ్యాఖ్యలతో సంబంధం లేదని.. ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సత్సంబంధాలు కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత అదే టీం వెళ్లి పవన్ కళ్యాణ్ తోనూ సమావేశమైంది. మంత్రి నానితో దిల్ రాజు, బన్నీ వాసు, వంశీ,అలంకార్ ప్రసాద్ తో పాటు పలువురు సమావేశమయ్యారు. నిన్నటి క్యాబినెట్ లో ఆల్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల అంశం పై సినిమాటోగ్రఫీ చట్ట సవరణ కోసం చర్చ చేసినట్లుగా తెలుస్తోంది.

మంత్రి నానితో దిల్ రాజ్ టీం సమావేశం
ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ విధానం ద్వారా అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ టికెటింగ్ వ్యహారంలో సాంకేతిక అంశాలను చర్చించిన సినీ ప్రముఖులు... మంత్రికి కొన్ని సూచనలు ప్రతిపాదించినట్లుగా సమాచారం. కోవిడ్ సమయంలో సినిమా థియేటర్లకు విద్యుత్ ఫిక్సడ్ ఛార్జీల వెసులుబాటు అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా డిస్కమ్ ల నుంచి భారీగా జరిమానాలు రావటంతో వాటిని రద్దు చేయాల్సిందిగా థియేటర్ యాజమాన్యాలు కోరుతున్నాయి.

సవరణలు కోరారా.. వరాలు అడిగారా
ఈ విషయాన్ని మంత్రితో చర్చించారని తెలుస్తోంది. అయితే, సమావేశం తరువాత దిల్ రాజు మాట్లాడుతూ... ప్రభుత్వం వైపు నుంచి కొంత సమాచారం అడిగారని.. అది ఇచ్చేందుకు వచ్చామన్నారు. అయితే, అసలు చర్చల ప్రతిపాదనలు..సమస్యలు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించిన మెగాస్టార్ చిరంజీవి ఏమయ్యారు. ఇప్పుడు ఆయన ఎక్కడా ఈ చర్చల్లో ఎందుకు పాల్గొనటం లేదనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసిన తరువాత సైతం..చిరంజీవి ఫోన్ చేసి మంత్రి పేర్ని నానితో మాట్లాడారు.

చిరంజీవి జోక్యం నిలిచిపోయిందా
కానీ, దిల్ రాజ్ నిర్మాతల అంశంతో పాటుగా డిస్ట్రిబ్యూటర్ల సమస్యల పైన ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లుగా సమాచారం. ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు ప్రారంభం కావటంతో ఇండస్ట్రీ కొంత ఊపిరి పీల్చుకుంది. ఇక, కరోనా సమయంలో ఎదురైన కష్టాల కారణంగా.. తమకు పన్నులు..కరెంటు బిల్లుల విషయంలో కొంత ఊరట కలిగించాలని సీనీ పెద్దలు కోరుతున్నారు. అయితే, గతంలో చిరంజీవికి మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి సినీ పరిశ్రమ సమస్యల పైన చర్చించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారని..త్వరలో సమావేశం ఉంటుందని చెప్పారు.

టాలీవుడ్ - ప్రభుత్వంలో ఆసక్తి కర అంశంగా..
కానీ, ఆ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు. ఇక, దిల్ రాజ్ టీం ఇప్పుడు వరుసగా మూడో సారి మంత్రి పేర్ని నానితో సమావేశమైంది. దీంతో..అసలు టాలీవుడ్ ఏం కోరుతోంది.. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది అనే చర్చ అటు సినీ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. అందునా గతంలో సినీ పరిశ్రమల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చల సమయంలో యాక్టివ్ గా ఉన్న చిరంజీవి ఎందుకు మౌనంగా ఉంటున్నారనే మరో చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications