హౌస్ఫుల్-కలెక్షన్ నిల్, ఆ వజ్రాల కోసమే: కేసీఆర్ వైఎస్ లాంటోడని రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పాలన హౌస్ ఫుల్ - కలెక్షన్ నిల్ అన్నట్లుగా ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డల శవాలపై అధికారం దక్కించుకున్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే రాజకీయ కొలువులు తెచ్చుకున్నాడని ఆరోపించారు.
జూరాల - పాకల అంటే జిల్లాలోనే పాతరేస్తామని కేసీఆర్ను హెచ్చరించారు. పాలమూరు జిల్లా విషయంలో వైయస్సార్ లాంటి దుర్మార్గుడే కేసీఆర్ అన్నారు. వైయస్సార్ పోతిరెడ్డిపాడుతో రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే జూరాల - పాకాల పేరుతో వరంగల్కు నీళ్లు తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదన్నారు.
కేసీఆర్ను పాలమూరు నుంచి పార్లమెంట్కు పంపిస్తే, ఈ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఆసుపత్రి స్థానంలో సచివాలయం అని, సచివాలయం స్థానంలో ఆకాశహర్మ్యాలు కడతామనే ప్రకటనలతో కేసీఆర్ ఏంటో తెలిసిపోయిందన్నారు. ఆయన రాక్షసుడని, ఎర్రగడ్డకు పంపించాలన్నారు. అభయారణ్యం, అభివృద్ధి తదితర కారణాలు చెప్పి నల్లమల అటవీ ప్రాంతం నుండి చెంచులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
అక్కడి నేలలో విలువైన వజ్రాలున్నాయని, వాటిని కొల్లగొట్టేందుకు కేసీఆర్ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. తెరాస పార్టీలో సమర్థులైన నాయకులు లేరని, అందుకే టీడీపీ నుండి ఎమ్మెల్యేలను లాక్కొని మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు.
జీహెచ్ఎంసీపై తలసాని
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు తమ ప్రభుత్వం వెనుకాడటం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జన గణన, వార్డుల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం వద్దన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందని, అది వాపు అని, దానినే అది బలం అనుకుంటుందని ఎద్దేవా చేశారు.