అమరావతికి పెనుముప్పు: బాబు సర్కారుపై ఐవైఆర్ కృష్ణారావు సంచలనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘ఏపీ రాజధాని అమరావతి కలల, ఊహాజనిత రాజధాని.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. 'ఏపీ రాజధాని అమరావతి కలల, ఊహాజనిత రాజధాని. కొందరి స్వప్రయోజనాల కోసం అమాయకులను మోసగించేలా ప్రచారం సాగుతోందని ఆరోపించారు.
ఎప్పటికైనా కుప్పకూలిపోయి సమాధి అవుతుందని ఐవైఆర్ కృష్ణారావు ఘాటాగా స్పందించారు. గ్రీన్ సోలిడర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని రోటరీ రెడ్క్రాస్ హాలులో 'అమరావతి రాజధాని-పర్యావరణం'పై జరిగిన సదస్సులో కృష్ణారావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సభకు సంస్థ అధ్యక్షుడు పండలనేని శ్రీమన్నారాయణ అధ్యక్షత వహించారు.

సామాన్యుల భాగస్వామ్యం లేకుండానా?
సామాన్య, మధ్యతరగతి, వ్యవసాయ కూలీల భాగస్వామ్యం లేకుండా ప్రపంచంలో ఏ రాజధాని కూడా అభివృద్ధి చెందలేదని, అమరావతిలో ఈ వర్గాలకు స్థానం కన్పించడం లేదని ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. అప్పులతో అతి పెద్ద రాజధానిని నిర్మించవచ్చు.. కానీ దాని నిర్వహించే ఆర్థిక స్థోమత ఈ రాష్ట్రానికి లేదన్నారు. వాస్తవానికి పరిపాలన రాజధానికి 275 ఎకరాలు చాలని, ఇదే విషయం శివరామకృష్ణన్ కమిటీ కూడా సిఫార్సు చేసిందన్నారు.

తలవంచాల్సి వచ్చింది..
అసలు తెలంగాణ అభివృద్ధి మొత్తం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతోందన్న ఐవైఆర్.. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలకు చేయూతనిస్తే మెట్రోపాలిటన్ నగరాలుగా మారతాయన్నారు. దొనకొండలో పరిపాలన రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలంటూ తాను సూచన చేసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. సీఎస్గా ప్రభుత్వ వ్యవస్థలో తాను అతి పెద్ద భాగస్వామి అయినందున అన్నింటికీ తలవంచాల్సి వచ్చిందని, పైగా నాడు తాను మౌలికంగా, లిఖితపూర్వకంగా రాజధాని విషయంలో చేసిన సూచనలను వెల్లడించడం భావ్యం కాదన్నారు.

వారేం దద్దమ్మలు కాదు..
శివరామకృష్ణన్ కమిటీలో ఏ ఒక్కరూ దద్దమ్మలు కాదని ఐవైఆర్ అన్నారు. అయినా ఆ కమిటీ ఇచ్చిన నివేదికనే పాలకులు బుట్టదాఖలు చేసినప్పుడు సీఎస్గా తాను వెలిబుచ్చే అభిప్రాయాలకు ఏమి విలువ ఉంటుందని ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు.
నూతన నగర నిర్మాణం దశాబ్దాలతో కూడిన పని అంటూ తేల్చిచెప్పారు.

దారుణం.. ఆగిపోయే అవకాశం
ప్రస్తుతం సేకరించిన 38వేల ఎకరాలు కాకుండా అటవీ భూములను డీనోటిఫై చేసి మరో 20వేల ఎకరాలు సేకరించాలని ప్రయత్నిస్తుండటం దారుణమన్నారు. న్యాయ చట్టం ప్రకారం హైకోర్టులో సరైన వాదన వినిపిస్తే ఆగిపోగలదన్నారు. అసలు నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో పరిపాలన రాజధానిని నిర్మిస్తే ఈ రెండు నగరాలు కలిసిపోతాయని అన్నారు.

అమరావతికి పెనుముప్పు..
అన్నింటి మించి ప్రస్తుత రాజధానికి పెనుముప్పు పొంచి ఉందన్నారు. పొరబాటున ఎగువన ఉన్న ఏ డ్యాంకు ముప్పు సంభవించినా ఆ తాకిడి చివరగా అమరావతిపైనే ఉంటుందనేది గుర్తించుకోవాలని ఐవైఆర్ అన్నారు. అమెరికా రాజధాని న్యూయార్క్ కాదు వాషింగ్టన్ డిసి నగరమన్నారు. 1990లో ఎంపిక చేస్తే దీనికి ఓ స్వరూపం వచ్చేసరికి ఓ శతాబ్ద కాలం పట్టిందని, ఆస్ట్రేలియాకు అతి చిన్న పట్టణంలో రాజధాని ఉందని, అమెరికాలో న్యూయార్క్ రాష్ట్ర రాజధాని ఆల్బనీ పెద్ద నగరమేమీ కాదని వివరించారు ఈ మాజీ సీఎస్.












Click it and Unblock the Notifications